ETV Bharat / opinion

టార్గెట్ 370పై BJP ఫోకస్- దక్షిణాదిలో ఆ పని చేస్తే లైన్ క్లియర్?- బలాలు, బలహీనతలివే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 8:02 PM IST

BJP Lok Sabha Elections 2024 Analysis : క్యాడర్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. గత పదేళ్లుగా ఈ పార్టీయే దేశాన్ని పాలిస్తోంది. 370 లోక్‌సభ సీట్లు సాధించాలన్న పెద్ద టార్గెట్‌తో ఎన్నికల బరిలోకి దూకుతున్న కమలదళం బలాలు ఏమిటి? బలహీనతలు ఏమిటి ? గెలిచేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి? పొంచి ఉన్న అపాయాలు ఏమిటి? అనేవి విషయాలు సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

BJP SWOT Analysis 2024
BJP SWOT Analysis 2024

BJP Lok Sabha Elections 2024 Analysis : బీజేపీ అంటేనే బిగ్ టార్గెట్ అనేలా ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 370 సాధించాలనే పెద్ద గోల్‌ను కమలదళం పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ, వరుసగా మూడోసారి కేంద్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మోదీ సేన ముందుకు సాగుతోంది. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 414 స్థానాలకు గెల్చుకోగలిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రయత్నాలకు సానుభూతి కూడా తోడైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి అంతగా సీట్ల మైలేజీని సాధించిపెట్టే అంశాలు ఏమున్నాయి? 2019 ఎన్నికల్లో 303 లోక్‌సభ సీట్లను సాధించిన బీజేపీ, ఈసారి ఏకంగా 370 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమయ్యే విషయమేనా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వీటికి సమాధానాలను ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.

బీజేపీ 'బలాబలాలు'

  • విపక్ష నేతలపైకి పదునైన విమర్శనాస్త్రాలను సంధించడంలో ప్రధాని మోదీ ఆయనకు ఆయనే సాటి. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేసిన తీరు అపూర్వం. బీజేపీ ఉనికి అంతం మాత్రంగానే ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణాలలో సంస్థాగత నిర్మాణం బలపడేలా ఆయన చేసిన పర్యటనలు అమోఘం. అక్కడి అధికార పార్టీలను టార్గెట్ చేస్తూ ఆయా రాష్ట్రాల ప్రజల చూపును బీజేపీ వైపునకు తిప్పడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలోపేతమైంది.
  • ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పర్యవేక్షించే బలమైన వ్యవస్థ 2014 సంవత్సరం నుంచే బీజేపీకి ఉంది. ఇది ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలలో విస్తరించి ఉంది. అనుభవజ్ఞులైన ఎన్నికల ప్రచారకులు ఈ టీమ్‌లలో సభ్యులుగా ఉంటారు. ప్రజలను ప్రభావితం చేసే ప్రచార వ్యూహాలను రచించడంలో ఎన్నికల ప్రచారకుల టీమ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి.
  • అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉన్న దాఖలాలు చాలా ఉన్నాయి. కమలదళం క్షేత్ర స్థాయిలో బలంగా ఉండబట్టే ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది.
  • బీజేపీకి మరో బలం ఉంది. అదేమిటంటే ఎన్నికల పోరుకు పిచ్‌ను సెట్ చేసే విషయంలో దానికి తిరుగులేని పట్టు ఉంది.
  • జాతీయ, సాంస్కృతిక అంశాలే బీజేపీ ఎజెండాలో ప్రధానంగా ఉంటాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని టచ్ చేసేలా ఉంటాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారం కూడా ప్రతీచోటకు చేరడం పెద్ద అడ్వాంటేజ్.

బీజేపీ 'బలహీనతలు'

  • దేశ రాజకీయాల్లో బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబాలకు చెందిన వారికి ఇటీవల కాలంలో కమలదళం కీలక పదవులను కట్టబెట్టింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌, హరియాణా సీఎం నయాబ్‌సింగ్‌ సైనీ ఆ కోవలోకే వస్తారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి వారికి పెద్ద పరీక్షా సమయంగా మారనున్నాయి. దీన్ని ప్రతిపక్షాలు అదునుగా మలుచుకొని ప్రయోజనం పొందే ముప్పు లేకపోలేదు.
  • బీజేపీ హిందుత్వ ఎజెండా ప్రతీసారీ ఫలితాలను ఇస్తుందని కచ్చితంగా చెప్పలేం. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కావడం వల్ల బీజేపీ చేతిలో ఇక అంత పెద్ద స్థాయి కలిగిన ప్రచార అస్త్రమేదీ మిగల్లేదు.
  • కేవలం సంక్షేమ పథకాల గురించి వివరించి ఓట్లు అడిగితే బీజేపీ అభ్యర్థులు నెగ్గుతారా ? అంటే కాదనే చెప్పాలి. వాటితో పాటు చాలా అంశాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్థానిక సమీకరణాలు కూడా కీలకంగా మారుతాయి.
  • ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారత దేశంలో బీజేపీ క్యాడర్ అంత స్ట్రాంగ్‌గా లేదు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా సౌత్‌లో క్యాడర్‌ను బీజేపీ బలోపేతం చేయలేకపోయింది.

బీజేపీకి విజయ 'అవకాశాలు'

  • 2014, 2019 కంటే ఈసారి మరింత జోష్‌తో బీజేపీ ఎన్నికల నగారా మోగించింది. ప్రధాని మోదీ తొలుత దక్షిణాదిపై ఫోకస్ చేస్తున్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇది కలిసొచ్చే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో పేలవంగా ఫలితాలు వచ్చిన దక్షిణాదిలో బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయడం బీజేపీకి ప్లస్ పాయింటే అవుతుంది.
  • 'ఇండియా' కూటమిలో ఇటీవల కాలంలో చాలా చీలికలు వచ్చాయి. బంగాల్‌లో మమతా బెనర్జీ గుడ్ బై చెప్పారు. బిహార్‌లో నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీతో చెయ్యి కలిపారు. మరోవైపు ఎన్డీఏ కూటమి మాత్రం బలంగా ఉంది. ఇలాంటి చీలికలేం జరగలేదు. ఏ రకంగా చూసుకున్నా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడుతో పొత్తు బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ కానుంది. తెలంగాణలో బీఆర్ఎస్, తమిళనాడులో ఏఐఏడీఎంకే బలహీనపడటం బీజేపీకి లోక్‌సభ సీట్లను పెంచుకునేందుకు కొత్త అవకాశాలను క్రియేట్ చేసింది. ఆ అవకాశాలను ఉపయోగించుకుని దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతమైతే 370 లోక్‌సభ సీట్ల టార్గెట్‌ను సాధించేందుకు లైన్ క్లియర్ అవుతుంది.

బీజేపీకి పొంచి ఉన్న 'అపాయాలు'

  • ఎన్నికల బాండ్ల వ్యవహారం బీజేపీకి మైనస్ పాయింట్‌గా మారే ఛాన్స్ ఉంది. మోదీ సర్కారు 2018 సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన ఎన్నికల బాండ్ల స్కీంను ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ స్కీం పారదర్శకంగా లేదని దాతల వివరాలను దాచడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు పడటం కమలదళం ఇమేజ్‌ను మసకబార్చింది. దీన్ని ప్రతిపక్షాలు ఎన్నికల్లో పెద్దఎత్తున లేవనెత్తే ముప్పు ఉంది.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించిన కర్ణాటక, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. బిహార్‌లోని ఆర్‌జేడీ, ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ వంటి ప్రాంతీయ పార్టీలు ఓబీసీలు, దళితుల ఓట్ల చీల్చి బీజేపీకి చాలా లోక్‌సభ సీట్లలో నష్టం చేసే రిస్క్ ఉంది.
  • ఉపాధి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రజలతో కనెక్ట్ అయ్యే అంశాలను ప్రతిపక్ష పార్టీలు ప్రచారం హైలైట్ చేసే అవకాశం ఉంది. కరోనా సంక్షోభంతో ఎన్నో కుటుంబాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నాయి. అవి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు క్యూ కట్టే ముప్పు లేకపోలేదు.

వారణాసి టు వయనాడ్​​- రసవత్తర పోరుకు అంతా రె'ఢీ'- లోక్‌సభ హాట్​ సీట్లు ఇవే!

2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కాంగ్రెస్​కు సాధ్యమేనా? హస్తం​ పార్టీకి ఉన్న బలాబలాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.