ETV Bharat / international

పాకిస్థాన్ ఎన్నికల తుది ఫలితాలు విడుదల​- మెజారిటీ ఇమ్రాన్ ఖాన్​కే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 4:41 PM IST

Pakistan Election Results
Pakistan Election Results

Pakistan Election Results : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో పలు కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ మిత్రపక్షాలకు అత్యధికంగా 101 సీట్లు దక్కాయి. నవాజ్‌ షరీఫ్‌, బిలావాల్‌ భుట్టో పార్టీలు జట్టు కట్టినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత బలం చేకూరక పోవడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో సైన్యం జోక్యం చేసుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి.

Pakistan Election Results : పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 8న 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్నికల సంఘం 264 స్థానాల ఫలితాలను వెల్లడించింది. వీటిలో పలు కేసుల్లో దోషిగా తేలి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (PTI) పార్టీ మద్దతుదారులకు అత్యధికంగా 101 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్‌ పార్టీ గుర్తును ఈసీ రద్దు చేయడం వల్ల వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి నెగ్గారు. వీరంతా ఇమ్రాన్‌కే మద్దతు తెలిపారు.

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉండగా ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మరణించడం వల్ల 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో అత్యధికంగా మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ మద్దుతుదారులకు అత్యధిక స్థానాలు దక్కాయి. ఆ తర్వాత పాకిస్థాన్​ను 3 పర్యాయాలు ఏలిన మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్‌ ముస్లీం లీగ్‌ నవాజ్‌ పార్టీకి ఓటర్లు 75 స్థానాలను కట్టబెట్టారు. ఫలితంగా పార్లమెంట్‌లో సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా పాకిస్థాన్‌ ముస్లీం లీగ్‌ నవాజ్‌ అవతరించింది. మరో మాజీ ప్రధాని దివంగత బేనజీర్‌ భుట్టో కుమారుడు బిలావాల్‌ జర్దారీ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ 54 సీట్లు సాధించింది. కరాచీలో విస్తరించిన ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉండే ముత్తాహిదా క్వామీ మూమెంట్‌ పాకిస్థాన్‌ పార్టీకి 17, మరో 12 స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి.

అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బలూచిస్థాన్‌లోని 3 స్థానాల ఫలితాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఫలితాల వెల్లడికి ముందు ప్రక్రియ ఆలస్యంగా జరగడం వల్ల పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు తెలియజేశాయి. నవాజ్‌ షరీఫ్‌, బిలావాల్‌ జర్దారీ భుట్టో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 సీట్లు అవసరం అవుతాయి.

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో సైన్యం జోక్యం చేసుకుంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. నవాజ్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సైన్య అధ్యక్షుడు జనర్‌ ఆసీమ్‌ మునీర్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు. అవినీతి ఆరోపణల్లో శిక్ష పడి బెయిల్‌పై లండన్‌ పారిపోయిన షరీఫ్‌ సరిగ్గా ఎన్నికల ముందు స్వదేశానికి రావడం వెనుకా సైన్యం హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఫిబ్రవరి 15న రీ పోలింగ్
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం అదేశాలు జారీ చేసింది. అందులో పంజాబ్​ ప్రావిన్స్​లోని ఎన్​ఏ-88లోని 26 పోలింగ్ కేంద్రాల్లో కొంతమంది ఎన్నికల సామగ్రిని ధ్వంసం చేయటం వల్ల రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. సింధు ప్రావిన్స్​లో​ పీఎస్-18 నియోజకవర్గంలోని రెండు, ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్స్ పీకే-90 నియోజకవర్గంలోని 25 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ఎన్నికలు జరుగనున్నాయి.

సంకీర్ణ ప్రభుత్వానికి జై కొట్టిన సైన్యం- స్వతంత్రుల మద్దతు నవాజ్​కే! ఇంకా తేలని పాక్​ ఫలితం

పాకిస్థాన్‌లో నవాజ్‌ సంకీర్ణమే- పొత్తుకు భుట్టో పార్టీ ఓకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.