ETV Bharat / international

ఎన్నికల వేళ పాక్​లో జంట పేలుళ్లు- 30మంది దుర్మరణం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 3:14 PM IST

Updated : Feb 7, 2024, 7:26 PM IST

Pakistan Blast News Today : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఉగ్రవాదులు రెండు ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 30మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు దాడులు బలూచిస్థాన్‌ ప్రావిన్స్​లోనే జరిగాయి.

Pakistan Blast News Today
Pakistan Blast News Today

Pakistan Blast News Today : సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్​లో సంభవించిన జంట పేలుళ్లలో 30 మంది మరణించారు. 42 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలను పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లకుండా నిరోధించేందుకు ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ తెలిపారు.

బలూచిస్థాన్‌లోని పిషిన్‌ ప్రాంతంలో ఓ స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వద్ద బుధవారం తొలిదాడి జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఒక లగేజీ బ్యాగులో బాంబును అమర్చి ఘటనాస్థలిలో పెట్టి వెళ్లారని, ఆ తర్వాత రిమోట్‌తో దాన్ని పేల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. బాంబు తీవ్రతకు ఘటనాస్థలిలో అనేక ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయని చెప్పారు

మొదటి పేలుడు సంభవించిన చోటుకు 150 కిలోమీటర్ల దూరంలోని ఖిల్లా సయిఫ్‌ ఉల్లాహ్‌ జిల్లాలో రెండో బాంబు దాడి జరిగింది. ఈ దాడి కూడా ఎన్నికల కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 8 మంది పౌరులు మరణించారు. గాయపడ్డ 12 మందిని మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు దాడులకు ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు.

హింసాత్మక ఘటనల దృష్ట్యా భద్రతా సిబ్బందిని మరింత పెంచాలని పాకిస్థాన్​ ప్రభుత్వం నిర్ణయించింది. బలూచిస్థాన్‌ ప్రావిన్సులో చెక్‌పోస్టులు, ఎన్నికల ప్రచార కేంద్రాలు, ర్యాలీలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం నుంచి ఇప్పటివరకు 50 వరకు గ్రనేడ్‌ దాడులు జరిగినట్లు సమాచారం.

పాకిస్థాన్‌లో గురువారం (ఫిబ్రవరి 8) సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీలు ఓటింగ్‌కు వెళ్లనున్నాయి. నాలుగేళ్లుగా లండన్‌లో తల దాచుకున్న పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కొన్ని నెలల క్రితం స్వదేశానికి వచ్చారు. మరోవైపు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వరుస కేసులు, శిక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం దాయాది దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాక్​ ఎన్నికల బరిలో ముంబయి ఉగ్రదాడి సూత్రధారి!- కొత్త పార్టీ ప్రకటన

పాక్​లో 21మంది ఉగ్రవాదులు హతం- నలుగురు అధికారులు, ఇద్దరు పౌరులు మృతి

Last Updated : Feb 7, 2024, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.