ETV Bharat / health

రంజాన్‌ ఉపవాసం - షుగర్‌ పేషెంట్లు ఈ జాగ్రత్తలు పాటించాలి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 5:12 PM IST

Ramadan Fasting Tips For Diabetic Patients : ముస్లింలకు రంజాన్‌ అత్యంత పవిత్ర మాసం. ఈ మాసంలో దాదాపు ముస్లింలు అందరూ ఉపవాసం ఉంటారు. అయితే.. ఉపవాసం ఉండే వారిలో షుగర్‌ పేషెంట్లు ఉంటే వారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి.. అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

Ramadan Fasting Tips For Diabetic Patients
Ramadan Fasting Tips For Diabetic Patients

Ramadan Fasting Tips For Diabetic Patients : రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో చాలా మంది ముస్లింలు ఉపవాసం ఉంటారు. కఠోర దీక్ష చేస్తారు. వేకువ జాము నుంచి సూర్యస్తమయం వరకూ ఎటువంటి ఆహారమూ తీసుకోరు. ఇలా వారు దాదాపు 12 నుంచి 14 గంటల పాటు ఏమీ తినకుండా, తాగకుండా ఉంటారు. అయితే.. ఉపవాసం ఉండే వారిలో కొంత మంది షుగర్‌ పేషెంట్లు కూడా ఉంటారు. ఇలాంటి వారు ఉపవాసం చేసే సమయంలో ఇబ్బందులు రాకుండా కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ జాగ్రత్తలు పాటించండి :

  • షుగర్‌ వ్యాధితో బాధపడేవారు ఉపవాసం ఉంటే వారి శరీరంలో గ్లూకోజ్‌ మోతాదులు పడిపోవచ్చు, పెరగనూవచ్చు. ముఖ్యంగా ఇఫ్తార్‌ అనంతరం గ్లూకోజ్‌ చాలా వేగంగా, ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు.
  • కాబట్టి, ఉపవాసం ఉండే వారు ఆహారం విషయంలో ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
  • షుగర్‌ పేషెంట్లు ఉపవాసం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి. కాబట్టి.. రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం రక్తంలో షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే 'హైపర్గ్లైసీమియా' సమస్యకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
  • ఉపవాసం ఉండే షుగర్‌ పేషెంట్లు సెహ్‌రీ (తెల్లవారుజామున ఆహారం), ఇఫ్తార్‌ (ఉపవాసం విరమించే భోజనం) సమయంలో సమతుల ఆహారం తీసుకోవాలి.
  • రోజంతా శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • అలాగే పప్పులు, నీరు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతోంది కాబట్టి, శరీరం డీహైడ్రైషేన్‌కు గురికాకుండా ఉండటానికి సెహ్‌రీ, ఇఫ్తార్‌ సమయాల్లో ఎక్కువ నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • నూనెలో వేయించిన పూరీ, సమోసా, మాంసాహారం తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. వీటికి బదులుగా ఉడికించినవి తినాలని చెబుతున్నారు. అలాగే గోధుమలతో చేసిన రోటీలను తినవచ్చు.
  • షుగర్‌ పేషెంట్లు ఉపవాసం సమయంలో నూనె ఎంత తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే అంత మంచిదని చెబుతున్నారు.
  • మధుమేహం ఉన్న వారు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినాలని చెబుతున్నారు.
  • ఇఫ్తార్ సమయంలో అతిగా తినకుండా ఉండాలి. అలాగే తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండాలని సూచిస్తున్నారు.
  • ఉపవాసం ఉండే సమయంలో నీరసం వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎదురైతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
  • ఇలా జాగ్రత్తలు పాటిస్తూ ఉపవాసం ఉండటం వల్ల పవిత్రమైన రంజాన్‌ మాసంలో షుగర్‌ వ్యాధి ఉన్న వారు ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అలర్ట్‌ : మీ కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? - షుగర్ సంకేతం కావొచ్చు!

నిజంగా చక్కెరకన్నా బెల్లం మంచిదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.