ETV Bharat / entertainment

తెలుగు నిర్మాతలతో కోలీవుడ్ స్టార్స్ - ఈ కాంబో సూపర్ హిట్టే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 7:10 PM IST

Telugu Producers With Kollywood Stars : ఇటీవల కాలంలో టాలీవుడ్​లోని పలువురు మేకర్స్ తమిళ హీరోలతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి, అనుదీప్ కేవీ వంటి డైరెక్టర్లు తమిళ చిత్రాలు తెరకెక్కించగా, మరికొందరు ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నారు.

Telugu Producers with Kollywood stars
Telugu Producers with Kollywood stars

Telugu Producers With Kollywood Stars : పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. మేకర్స్​ కూడా తమ పరిధిని దాటి మాతృకతో పాటు పలు భాషల్లో సినిమాలు తెరకెక్కిస్తూ అక్కడి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఇక హీరోలు కూడా ఈ కానెప్ట్​కు ఓటు వేస్తున్నారు. దీంతో పలువురు కోలీవుడ్ స్టార్స్ తెలుగు ఇండస్ట్రీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్​తో డీవీవీ దానయ్య ఓ భారీ సినిమాను ప్లాన్ చేసినట్లు సమాచారం. తల అజిత్​ కూడా మైత్రి మూవీ మేకర్స్​ చిత్రాన్నికి సైన్​ చేశారు. దీనికి గోపిచంద్ మలినేని డైరెక్టర్​గా వ్యవహరించనున్నారు. ఇక ధనుశ్ ఇప్పటికే వెంకీ అట్లూరీతో 'సార్' అనే సినిమా కోసం పనిచేశారు. ఇప్పుడు శేఖర్ కమ్ములతో ఏషియన్ బ్యానర్​లో ఓ చిత్రానికి సైన్ చేశారు. ఇలా పలువురు తమిళ నటులు నెమ్మదిగా తెలుగు సినిమాలపై ఫోకస్​ చేస్తున్నారు.

1950 నుంచే ఈ ట్రెండ్ మొదలు :
అయితే తమిళ హీరోలతో తెలుగు ప్రొడ్యూసర్లు సినిమాలు తీయడం అనేది కొత్త సాంప్రదాయం ఏమీ కాదు. మద్రాసు పట్టణంలో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు పెనవేసుకుపోయి అభివృద్ధి చెందాయి. ఆ కాలం నుంచి తెలుగు ప్రొడ్యూసర్లు నిర్మించే చిత్రాల్లో చాలామంది తమిళ హీరోలు నటించారు. 50వ దశకంలోనే తెలుగు వారైన ప్రముఖ నిర్మాతలు బి.యన్.రెడ్డి, చక్రపాణి ఆధ్వర్యంలోని విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద జెమినీ గణేషన్, శివాజీ గణేషన్, ఎంజీఆర్ లాంటి నటులు పలు చిత్రాల్లో నటించారు. వీరందరూ ఆయా బ్యానర్లలో పలు సూపర్ హిట్స్ అందుకున్నారు. జెమినీ గణేషన్ సూపర్ స్టార్​గా నిలిపిన చిత్రాల్లో 'మిస్సియమ్మ', 'గుణసుందరి' సినిమాలను నిర్మించింది విజయ ప్రొడక్షన్స్ వారే కావడం విశేషం.

కలర్ సినిమాలు సిల్వర్ స్క్రీన్​పై సందడి చేస్తున్న సమయంలోనూ పలువురు తమిళ హీరోలతో తెలుగు నిర్మాతలు సినిమాలు తీశారు. టాలీవుడ్ స్టార్ నిర్మాత రామానాయుడు సైతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించారు. అయితే తర్వాతి కాలంలో పెద్ద పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లు సినిమాల సంఖ్య తగ్గించుకోవడం వల్ల ఇతర భాషల్లో సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో ఉన్న నిర్మాతలు కేవలం తెలుగుకే పరిమితం అవుతూ వచ్చారు.

పాన్​ ఇండియా మార్కెటే టార్గెట్​ :
పాన్ ఇండియా సినిమాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మార్కెట్ దృష్టిలో ఉంచుకొని ఇతర భాషల్లో ఉన్నటువంటి హీరోల క్రేజ్​ను సొంతం చేసుకునేందుకు తెలుగు నిర్మాతలు సైతం సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ పరిశ్రమ విస్తరించిన తర్వాత ఇతర హీరోలకు కూడా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతోంది. సార్ సినిమాతో తెలుగు డైరెక్టర్​తో పని చేసిన ధనుశ్​ ఇప్పుడు తెలుగు డైరెక్టర్ల చిత్రాలను నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భిన్న కథనాలు,విభిన్న వాతావరణంలో సినిమాలు చేస్తే ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించినట్లు అవుతుందని సైతం తమిళ హీరోలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గతంలో తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు తెలుగులోని అగ్ర హీరోలు సైతం పోటీ పడేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు తమిళ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో తెలుగు డైరెక్టర్లు తీస్తున్న సినిమాలు పాన్ ఇండియాలో సూపర్ హిట్ టాప్ తెచ్చుకుంటున్నాయి. డబ్బింగ్ వల్ల కంటెంట్​కు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తెలుగు డైరెక్టర్ల ట్యాలెంట్​ యావత్ ప్రపంచం గమనిస్తోంది.

ఇటీవలే డైరెక్టర్ సందీప్ వంగా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అలాంటి ఫిల్మ్​ మేకర్​తో కలిసి పని చేసేందుకు తమిళ హీరోలే కాదు ఏ భాషలో హీరో అయినా సిద్ధం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజ్​ను దృష్టిలో ఉంచుకొని పలువురు నిర్మాతలు తమ డైరెక్టర్లను వెంటబెట్టుకొని చెన్నైలో వాలిపోయి తమిళ్ స్టార్ హీరోల డేట్స్ ఫిక్స్ చేసుకొని వచ్చేస్తున్నారట.

విజయ్​ వారిసు సూపర్ రికార్డ్స్​ గురించి తెలుసా

'ధనుశ్​ 51' షూటింగ్ స్టార్ట్​​ - తిరుపతిలో మూవీ టీమ్ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.