Sri Lanka Seeta Temple Sarayu Water : శ్రీరాముడి ధర్మపత్ని సీతమ్మ తల్లి ఆలయ ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలు శ్రీలంకకు వెళ్లనున్నాయి. ఇప్పటికే ఈ ప్రకియను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. మే19వ తేదీన శ్రీలంకలోని సీతమ్మ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో వినియోగించేందుకు పవిత్ర సరయూ నదీ జలాలను పంపాలని శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులు ఉత్తర్ప్రదేశ్ సర్కారుకు లేఖలో కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన యూపీ ప్రభుత్వం ఆ పవిత్ర జలాన్ని పంపించే బాధ్యతను పర్యటక శాఖకు అప్పగించింది.
ప్రత్యేక కలశంలో పవిత్ర జలాన్ని!
శ్రీలంకలో సీతమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారని, అందుకోసం సరయూ నీటిని పంపమని అడిగారని అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ సీఈవో సంతోష్ కుమార్ శర్మ తెలిపారు. ప్రత్యేక కలశంలో పవిత్ర జలాన్ని పంపిస్తున్నామని చెప్పారు. సీతమ్మ ఆలయంలో పూజలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. సీతమ్మ ఆలయంలో జరిగే వేడుక భారత్, శ్రీలంక మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. రెండు దేశాల హృదయాలను ఏకం చేయడమే ఆ వేడుక లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.
సనాతన ధర్మానికి ప్రతీక
శ్రీలంకలోని సీతమ్మ ఆలయం సనాతన ధర్మానికి ప్రతీకగా ఉంటుందని మహంత్ శశికాంత్ దాస్ తెలిపారు. ఇది సనాతనీయులందరికీ గర్వకారణమని, లంకలో సీతాదేవి ఎన్నో కష్టాలు ఎదుర్కొందని, అదే లంకలో ఇప్పుడు గొప్ప ఆలయాన్ని నిర్మిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆలయం నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీ చొరవను ఆయన ప్రశంసించారు.
అయోధ్య రామమందిర ట్రస్ట్ ప్రశంసలు
అయితే శ్రీలంకకు సరయూ జలాలు పంపడాన్ని అయోధ్య రామమందిర ట్రస్ట్ ప్రశంసించింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదపడతాయని అభిప్రాయపడింది. శ్రీలంకలోని ప్రస్తుతం సీతమ్మ ఆలయ సమీపంలోని కొండలపై ఉన్న చిహ్నాలను ఆంజనేయుడి పాదముద్రలుగా భక్తులు భావిస్తారు. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో సీతమ్మవారు రామలక్ష్మణులతో దర్శనమిస్తారు. ఈ ఆలయం వెలుపల జటాయువు విగ్రహం కనిపిస్తుంది.
అయోధ్య గుడికి కానుకగా 7 కిలోల 'బంగారు రామాయణం' - 7KGS GOLD RAMAYANA TO AYODHYA RAM