ETV Bharat / bharat

రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి కన్నుమూత- శ్రీలంకకు మృతదేహం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 8:56 AM IST

Updated : Feb 28, 2024, 10:07 AM IST

Rajiv Gandhi Assassination Convict Died
Rajiv Gandhi Assassination Convict Died

Rajiv Gandhi Assassination Convict Died : రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన సంథాన్ బుధవారం ఉదయం కన్నుమూశాడు. కాలేయ వైఫల్యంతో అతడు బుధవారం ఉదయం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. సంబంధిత ప్రక్రియలు పూర్తి చేసి బాడీని అతడి స్వస్థలమైన శ్రీలంకకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Rajiv Gandhi Assassination Convict Died : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంథాన్ కన్నుమూశాడు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి, సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022 నవంబర్​లో విడుదలైన అతడు బుధవారం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. కాలేయ వైఫల్యంతో అతడు మరణించినట్లు తెలుస్తోంది. ఉదయం 7.50 గంటలకు అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Rajiv Gandhi Assassination Convict Died
సంథాన్

"కాలేయ వైఫల్యానికి సంథాన్ చికిత్స తీసుకుంటున్నాడు. తిరుచిరాపల్లిలో స్పెషల్ క్యాంప్ నిర్వహించిన సమయంలో అతడు వైద్యులను సంప్రదించాడు. జనవరి 27న అతడు ఆస్పత్రిలో చేరాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అతడికి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. సీపీఆర్ చేసిన తర్వాత అతడిని బతికించాం. ఆక్సిజన్ సరఫరా చేస్తూ వెంటిలేటర్​పై ఉంచాం. కానీ, చికిత్సకు అతడి శరీరం స్పందించలేదు. ఉదయం 7.50 గంటలకు అతడు తుది శ్వాస విడిచాడు. పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది."
-ఈ తెరనిరాజన్, రాజీవ్ గాంధీ ఆస్పత్రి డీన్

సుప్రీంకోర్టు తీర్పుతో విడుదల
సంథాన్ అలియాస్ సుథేందిరరాజ (55) శ్రీలంకకు చెందిన వ్యక్తి. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన అతడు 3 దశాబ్దాలకు పైగా శిక్ష అనుభవించాడు. అతడితో పాటు అదే కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురిని సుప్రీంకోర్టు 2022లో విడుదల చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో తొలుత సంథాన్​కు మరణశిక్ష పడింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. 32 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో రిలీజ్ అయ్యాడు.

'ఇంటికి వెళ్దామని అనుకున్నాడు కానీ'
విడుదలైన ఏడుగురు శ్రీలంక దేశస్థులే కావడం, వారి వద్ద పాస్​పోర్ట్​లు, ట్రావెల్ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వారిని తిరుచ్చి సెంట్రల్ జైలు ఆవరణలోనే ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి ఉంచారు. ఇతర దోషులు విదేశాల్లో ఆశ్రయానికి విజ్ఞప్తి చేసుకోగా- తనను శ్రీలంకకు తిరిగి పంపించేలా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును సంథాన్ ఆశ్రయించాడు. అక్కడ తన పెద్దమ్మతో కలిసి ఉంటానని విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే, సంథాన్​ను శ్రీలంకకు పంపించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతడి న్యాయవాది పుగలేంధి తెలిపారు. చికిత్స ఆలస్యం చేయడం వల్లే సంథాన్ మరణించాడని చెప్పారు. సంథాన్ మృతదేహాన్ని అతడి స్వస్థలమైన జాఫ్నాకు చట్టపరంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

'మా నాన్నను ఎందుకు చంపారు?'.. నళినిని ప్రశ్నిస్తూ ఏడ్చేసిన ప్రియాంక

రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులపై ఎలాంటి ద్వేషం లేదు: రాహుల్

Last Updated :Feb 28, 2024, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.