ETV Bharat / bharat

'వయనాడ్ నుంచే పోటీ చేయాలా? అది కూటమి పార్టీలపైనా'- రాహుల్​పై వామపక్షాల ఆగ్రహం - Rahul Gandhi Vs Left Parties

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 3:43 PM IST

Rahul Gandhi Vs Left Parties In Wayanad
Rahul Gandhi Vs Left Parties In Wayanad

Rahul Gandhi Vs Left Parties In Wayanad : కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తుండటంపై వామపక్ష పార్టీల అగ్ర నేతలు పెదవి విరుస్తున్నారు. బీజేపీ బలంగా ఉన్న హిందీ బెల్ట్‌లోని ఏదైనా స్థానం నుంచి రాహుల్ పోటీ చేసి ఉంటే చాలా బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు.

Rahul Gandhi Vs Left Parties In Wayanad : కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఓ వైపు ఇండియా కూటమిలో వామపక్షాలతో కలిసి నడుస్తూనే మరోవైపు వయనాడ్‌లో వామపక్ష పార్టీలతో తలపడుతున్నారు. దీంతో వామపక్ష నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భిన్నమైన రాజకీయ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ కంచుకోట
వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సీపీఐకి చెందిన జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. ఆమె సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి. వాస్తవానికి 2008 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి వయనాడ్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. కేరళ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, దివంగత ఎంఐ షానవాస్ 2009, 2014 ఎన్నికల్లో వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో వయనాడ్, అమేఠీ లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేశారు రాహుల్ గాంధీ. ఆయన అమేఠీలో ఓడిపోగా, వయనాడ్ నుంచి గెలిచారు. అప్పట్లో వయనాడ్‌లో 4,31,770 ఓట్లతో సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌పై రాహుల్ గాంధీ విజయఢంకా మోగించారు.

హిందీ బెల్ట్‌లో పోటీ చేయాల్సింది
ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులను నిలబెట్టే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా భర్త, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. కూటమిలోని మిత్రపక్షం అభ్యర్థిపై రాహుల్ గాంధీ పోటీచేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏకమై పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలను పాటించడం ఆందోళనకరమన్నారు. ''వయనాడ్ ప్రజలు, కేరళ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేరళ ప్రజలను తేలిగ్గా తీసుకోలేం. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీని బలంగా ఢీకొనాలని భావిస్తే హిందీ బెల్ట్‌లోని ఏదైనా లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఉండాల్సింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్రల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి వామపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతమైన వయనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? నేరుగా బీజేపీతో రాహుల్ ఎందుకు తలపడటం లేదు?'' అని డి.రాజా ప్రశ్నల వర్షం కురిపించారు.

వామపక్ష పార్టీలతో పోటీనా
రాహుల్ గాంధీ వయనాడ్ కాకుండా మరేదైనా సీటు నుంచి పోటీ చేసి ఉండాల్సిందని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు. ''ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ స్థానాల విషయంలో మేం పూర్తి క్లారిటీతో ఉన్నాం. కూటమిలోని పార్టీలకు వ్యతిరేకంగా మేం ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చేస్తే మంచిది'' అని ఆయన సూచించారు. మిత్రపక్షాలతో పొత్తుల్లో భాగంగా ఈసారి 50 లోక్‌సభ స్థానాల్లోనే సీపీఎం పోటీ చేయనుంది.

బీజేపీకి పోటీగా ఉమ్మడి అభ్యర్థులే ఉండాలి
రాజకీయ పార్టీల వ్యూహాలు జాతీయ స్థాయిలో ఒకలా ఉంటే, రాష్ట్రాల స్థాయిలో మరోలా ఉంటాయని అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ''బీజేపీని ఎదుర్కోవాలనేదే ఇండియా కూటమి లక్ష్యమైనప్పుడు. వయనాడ్‌లో కూడా అదే జరగాలి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ రెండు కూడా అభ్యర్థులను నిలబెట్టాయి'' అని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఐ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరి ఉంటే వయనాడ్‌ నుంచి ఇండియా కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థే పోటీ చేసి ఉండేవాడన్నారు. కాగా, కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

బంగాల్​లో కలకలం- NIA అధికారుల కారుపై రాళ్ల దాడి- వాహనం ధ్వంసం - NIA Team Attacked in West Bengal

20ఏళ్లుగా ఎన్నికల్లో 'గ్యాస్​ డెలివరీ' బాయ్ పోటీ- పేదల కోసమే మరోసారి బరిలోకి! - Gas Vendor Contesting Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.