ETV Bharat / bharat

రెండో విడత పోలింగ్​కు జోరుగా ఏర్పాట్లు- రాహుల్, హేమమాలిని భవితవ్యమేంటో?​ - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 4:10 PM IST

Lok Sabha Elections 2024 Phase 2 : రెండో విడత లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రంతో ప్రచారం కూడా ముగియనుంది. ఈ విడతలో ప్రజాతీర్పును కోరనున్న కీలకమైన స్థానాలు, అభ్యర్థులపై పూర్తి వివరాలు మీకోసం.

Etv Bharat
Etv Bharat

Lok Sabha Elections 2024 Phase 2 : లోక్‌సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం శుక్రవారం (ఏప్రిల్ 26న) జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికలను దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో నిర్వహించనుండగా శుక్రవారం రోజున రెండోదశ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. వాస్తవానికి 89 స్థానాలకు పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు.

అయితే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న మరణించారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు (మే 7వ తేదీకి) వాయిదా వేసింది. మొత్తం మీద రెండో విడతలో ఎన్నికలు జరగనున్న ముఖ్యమైన లోక్‌సభ స్థానాలు, అభ్యర్థుల వివరాలు ఇవే.

loksabha elections 2024 phase 2
లోక్​సభ ఎన్నికలు 2024 రెండో విడత

ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు?
రెండో విడత ఎన్నికల పోలింగ్ కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు, కర్ణాటకలోని 14, రాజస్థాన్‌‌లోని 13, మహారాష్ట్రలోని 8, ఉత్తర్​ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, అసోం, బిహార్‌లలోని చెరో ఐదు స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌‌లోని చెరో స్థానంలో జరగనుంది.

loksabha elections 2024 phase 2
లోక్​సభ ఎన్నికలు 2024 రెండో విడత

కీలక నియోజకవర్గాలు ఇవే!
రెండో విడత ఎన్నికలు జరగనున్న కీలకమైన లోక్‌సభ స్థానాల జాబితాలో బిహార్‌లోని కిషన్‌గంజ్‌, ఉత్తర్​ప్రదేశ్‌లోని మథుర, అలీగఢ్​, మహారాష్ట్రలోని అకోలా, అమరావతి, కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, కేరళలోని వయనాడ్, కోజికోడ్, తిరువనంతపురం, అసోంలోని సిల్చార్, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, మధ్యప్రదేశ్‌లోని దామోహ్, రేవా స్థానాలు ఉన్నాయి. మణిపుర్‌లోని ఔటర్ మణిపుర్, రాజస్థాన్‌లోని బార్మర్, కోట, జలోర్, అజ్మీర్, బంగాల్‌లోని డార్జిలింగ్, బలూర్‌ఘాట్, కశ్మీర్‌లోని జమ్ము స్థానాల్లోనూ అభ్యర్థుల మధ్య ఉత్కంఠభరిత పోటీ నెలకొంది.

loksabha elections 2024 phase 2
లోక్​సభ ఎన్నికలు 2024 రెండో విడత

రాహుల్ గాంధీ (వయనాడ్)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. రెండోసారి కూడా అక్కడి నుంచి గెలవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ తలపడుతున్నారు. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా కూడా పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర్​ప్రదేశ్‌లోని అమేఠీతో పాటు వయనాడ్‌లోనూ పోటీ చేశారు. అయితే ఆయన అమేఠీలో ఓడిపోగా, వయనాడ్‌లో గెలిచారు. అప్పట్లో రాహుల్ గాంధీకి వయనాడ్‌లో దాదాపు 7 లక్షల ఓట్లు పోలయ్యాయి.

loksabha elections 2024 phase 2
లోక్​సభ ఎన్నికలు 2024 రెండో విడత

హేమ మాలిని (మథుర)
ప్రముఖ నటి, బీజేపీ నేత హేమ మాలిని ఉత్తర్​ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ మథుర నుంచి ఆమె గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో హేమమాలిని ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర్​ప్రదేశ్‌ కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ ధంగర్‌ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ సీటులో హేమ మాలినికి 5,30,000 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) నేత కున్వర్ నరేంద్ర సింగ్‌పై 2.93 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో హేమమాలిని గెలిచారు.

అరుణ్ గోవిల్ (మేరఠ్)
రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో నటించి యావత్ దేశం మన్ననలు అందుకున్న ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ మేరఠ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీఎస్పీకి చెందిన దేవవ్రత్ కుమార్ త్యాగి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మ ఈ స్థానంలో అరుణ్ గోవిల్‌తో తలపడుతున్నారు. 2019లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర అగర్వాల్ 5.86లక్షల ఓట్లు సాధించి బీఎస్పీ అభ్యర్థి హాజీ మహ్మద్ యాకూబ్‌పై గెలిచారు.

loksabha elections 2024 phase 2
లోక్​సభ ఎన్నికలు 2024 రెండో విడత

ఇతర కీలక అభ్యర్థులు
రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర కీలక నేతల జాబితాలో కాంగ్రెస్‌ నేత శశి థరూర్ (తిరువనంతపురం), ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (రాజ్‌నంద్‌గావ్), కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పుర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (కోటా), వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్ (అకోలా), బీజేపీ బంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ (బాలూర్‌ఘాట్) తదితరులు ఉన్నారు.
కాగా, మొదటి విడతలో 102 లోక్‌సభ స్థానాల్లో దాదాపు 65 శాతం పోలింగ్ నమోదైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.