ETV Bharat / bharat

ఎన్నికల వేళ 'కచ్చతీవు' వివాదం- ఎవరు దాచారో తెలిసిందన్న జైశంకర్​! - Jaishankar Comments On Katchatheevu

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 11:10 AM IST

Updated : Apr 1, 2024, 12:06 PM IST

Jaishankar Comments On Katchatheevu Issue : కాంగ్రెస్​కు చెందిన ప్రధానులు కచ్చతీవు ద్వీపం పట్ల ఉదాసీనత ప్రదర్శించారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ మండిపడ్డారు. న్యాయపరమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ భారతీయ మత్స్యకారుల హక్కులను అప్పటి పాలకులు కాలరాశారంటూ ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Jaishankar Comments On Katchatheevu Issue
Jaishankar Comments On Katchatheevu Issue

Jaishankar Comments On Katchatheevu Issue : లోకసభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కచ్చతీవు వ్యవహారం రాజకీయకంగా పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా విదేశాంగశాఖ మంత్రి ఎస్​.జైశంకర్​ స్పందించారు. కచ్చతీవు అంశం అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు. జవహర్‌లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్​ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా 1974లో శ్రీలంకకు ఇచ్చిన కచ్చతీవును "చిన్న ద్వీపం" లేదా "చిన్న రాయి" అని పిలిచేవారని తెలిపారు. దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి అప్పటి ప్రధానులు దీనిని వదిలించుకోవాలనుకున్నారు. కాగా, ఈ అంశం తరచుగా పార్లమెంటులో ప్రస్తావనకు వస్తోందని చెప్పారు. కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వనికి మధ్య నిత్యం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని, కనీసం 21 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రికి సమాధానం ఇచ్చానని విలేకరుల సమావేశంలో జైశంకర్​ చెప్పుకొచ్చారు.

'నాటి పాలకులు ఉదాసీనంగా వ్యవహరించారు'
కచ్చతీవు ద్వీపాన్ని అప్పగించేటప్పుడు తమను సంప్రదించలేదని డీఎంకే చెప్పడాన్ని తప్పుబట్టారు మంత్రి జైశంకర్​. డీఎంకే ఒప్పందానికి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యవహరించడంపై స్పందిస్తూ, 1974లో తొలిసారిగా భారత్​, శ్రీలంకల మధ్య కుదిరిన ఒప్పందం గురించి అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధికి పూర్తి సమాచారాన్ని కేంద్రం అందించిందని పేర్కొన్నారు.

"వాస్తవమేంటంటే కచ్చతీవు ద్వీపానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా, ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి."
- జైశంకర్​, విదేశాంగ మంత్రి

6184 మంది మత్స్యకారుల నిర్బంధం!
1974 తరువాత ఈ పరిస్థితిని సృష్టించడానికి డీఎంకే, నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనంగా వ్యవహరించారని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 20ఏళ్లలో 6,184 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించిందని, వారికి చెందిన 1175 నౌకలను పొరుగు దేశం స్వాధీనం చేసుకుందని జైశంకర్​ చెప్పారు.

వాస్తవాలు తెలియాలనే ఇలా మాట్లాడుతున్నా : మంత్రి జైశంకర్​
భారతీయ మత్స్యకారులను విడుదల చేసేలా కృషి చేస్తున్నామని, ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జైశంకర్​ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కానీ, ఈ అంశంపై తమిళనాడు ప్రజలను చాలాకాలంగా తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ విషయానికి సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియాజేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ విధంగా మాట్లాడుతున్నానని జైశంకర్​ పేర్కొన్నారు.

జైశంకర్​ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన!
DMK On Katchatheevu Row : కచ్చతీవుపై విదేశాంగ మంత్రి జైశంకర్​ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్​ అన్నాదురై స్పందించారు. కచ్చతీవు ద్వీపం అంశంపై డీఎంకే ఎలాంటి బాధ్యతను తీసుకోవడం లేదని మంత్రి జైశంకర్​ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. 'గత పదేళ్లుగా అధికారంలో ఉంది బీజేపీనే కదా? అప్పుడు మీరేం చేశారు? మీ హయాంలో కచ్చతీవు ద్వీపం పునరుద్ధరణ కోసం ఏమీ చేయలేదు. ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు' అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 150 సీట్లు గెలవలేమన్న భయంతోనే బీజేపీ ఎలక్టోరల్​ బాండ్​ స్కాం నుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే ఈ సమస్యను లేవనెత్తిందని అన్నాదురై ఆరోపించారు.

కచ్చతీవు​పై మోదీ!
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ సైతం కచ్చతీవు పట్ల కాంగ్రెస్​ పార్టీ అనుసరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కచ్చతీవు ద్వీపం విషయంలో కాంగ్రెస్​ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ఎండగట్టారు. 1970లో కాంగ్రెస్​ పార్టీ కచ్చతీవు ద్వీపాన్ని పొరుగు దేశం శ్రీలంకకు నిర్మొహమాటంగా ఇచ్చేయాలన్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి దేశ సమగ్రత, సమైక్యత, ప్రయోజనాలను కాంగ్రెస్​ పార్టీ బలహీన పరుస్తూ వచ్చిందని ఎక్స్​ వేదికగా మోదీ ధ్వజమెత్తారు. 1974లో కాంగ్రెస్​ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు మొండి వైఖరితో వదిలేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీనికి సంబంధించి ఓ ఆర్​టీఐ నివేదికపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

'కాంగ్రెస్ తీరు ప్రజల్లో బలంగా పాతుకుపోయింది'
'కచ్చతీవు ద్వీపానికి సంబంధించి కాంగ్రెస్​ పార్టీ మొండిగా తీసుకున్న నిర్ణయం వల్లే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్​ నిర్ణయం పట్ల దేశ ప్రజలు ఆగ్రహించారు. కాంగ్రెస్​ పార్టీని ఇక ఎప్పుడూ నమ్మకూడదని ప్రజలు భావించారు. ఆనాడు కాంగ్రెస్​ పార్టీ అవలంభించిన తీరు ప్రజల మదిలో పాతుకుపోయింది. 75ఏళ్లుగా భారతదేశ సమగ్రత, సమైక్యత ప్రయోజనాలను బలహీన పరచడమే కాంగ్రెస్​ విధానం' అంటూ మోదీ కాంగ్రెస్​ పాలనపై ఫైర్​ అయ్యారు

1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు.

లోక్​సభ ఎన్నికల్లో మోదీ మ్యాచ్​ ఫిక్సింగ్- ఆ ఐదుగురితో కలిసి!: రాహుల్​ - Rahul Gandhi Fires On BJP

మోదీ ట్వీట్​తో కచ్చతీవుపై దుమారం- బీజేపీ, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం - BJP Congress Fight On Katchatheevu

Last Updated :Apr 1, 2024, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.