ETV Bharat / bharat

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు- రంగంలోకి రాహుల్- దీదీని ఒప్పించేందుకు నయా ఫార్ములా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 1:46 PM IST

INDIA Alliance Seat Sharing
INDIA Alliance Seat Sharing

INDIA Alliance Seat Sharing : ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఏకాభ్రిపాయానికి రావడానికి కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో ఆప్​, ఎస్​పీతో చర్చలు ఓ కొలిక్కి రాగా, బంగాల్​లో టీఎంసీని, మహారాష్ట్రలో శివసేన(యూబీటీ)ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

INDIA Alliance Seat Sharing : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి కసరత్తులు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా కూటమిలోని ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ)తో ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చిన కాంగ్రెస్, అదే జోరుతో తృణమూల్ కాంగ్రెస్​(టీఎంసీ)తో మళ్లీ చర్చలకు సిద్ధమైంది. ఇదివరకే ఇరుపార్టీల మధ్య చర్చలు నిలిచిపోయాయి.

టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌కు 2 స్థానాలకు మించి ఇవ్వలేమని తెలిపారు. అందుకు కాంగ్రెస్‌ అంగీకరించకపోవటం వల్ల అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతను ఒప్పించేందుకు కాంగ్రెస్‌ కొత్త ఫార్ములా సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా 5 సీట్లు ఇవ్వాలని కోరుతోంది.

ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్న కొన్ని సీట్లను కాంగ్రెస్‌కు ఇవ్వాలని టీఎంసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బెహ్రాంపూర్, మాల్దాసౌత్, మాల్దా నార్త్, రాయ్‌గంజ్, డార్జిలింగ్‌ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందుకు దీదీ సుముఖత తెలిపే అవకాశం ఉన‌్నట్లు తెలుస్తోంది. పురూలియా సీటు కూడా కాంగ్రెస్‌ కోరుతున్నా, మమత అంగీకరించకపోవచ్చని సమాచారం.

మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు- రంగంలోకి రాహుల్
మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలతో కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు చర్చలు ముందుకు సాగకపోవటం వల్ల కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వయంగా రంగంలో దిగారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా 8 సీట్ల విషయమై మహావికాస్‌ అఘాడీ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రేతో రాహుల్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య గంటపాటు సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

ముంబయిలో 6 లోక్‌సభ స్థానాలు ఉండగా, 3చోట్ల కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది. అయితే ఉద్ధవ్‌ వర్గం ముంబయిలో 4సీట్లు సహా మొత్తం 18 పార్లమెంటు స్థానాలు కావాలని కోరుతోంది. 2019లో శిందేవర్గం విడిపోకముందు శివసేన 22పార్లమెంటు స్థానాల్లో పోటీచేసి 18 చోట్ల గెలుపొందింది. అందులో ముంబయిలో 3స్థానాలు కూడా ఉన్నాయి. మరోవైపు సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే శరద్‌ పవార్‌తోనూ రాహుల్‌ చర్చలు జరిపారు.

బీజేపీ మిషన్​ 'జ్ఞాన్​'తో '400'కు తగ్గేదేలే! మోదీ, షాతో పాటు ఆ ఇద్దరు కూడా రంగంలోకి!
'2-3 రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్! కాంగ్రెస్- ఆప్​ పొత్తుతో భయపడ్డ బీజేపీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.