Congress AAP Seat Sharing : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారైంది. దిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా దిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్లో భరూచ్, భావ్ నగర్ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. మిగిలిన 24 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని వివరించారు. హరియాణాలో ఆప్ కురుక్షేత్ర స్థానం నుంచి పోటీ చేస్తుందని తెలిపారు. ఇక చంఢీగఢ్లో ఉన్న ఏకైక సీటులో కాంగ్రెస్ పోటీ చేయనుందని వెల్లడించారు.
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పోటీ చేసే స్థానాలు :
రాష్ట్రం (మొత్తం సీట్లు) | కాంగ్రెస్ | ఆప్ |
దిల్లీ (7) | 3 | 4 |
హరియాణా(10) | 9 | 1 |
గుజరాత్ (26) | 24 | 2 |
చంఢీగఢ్ (1) | 1 | - |
గోవా (2) | 2 | - |
అయితే పంజాబ్లో మాత్రం కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. పరస్పర అంగీకారంతోనే పంజాబ్లో వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. 'ప్రస్తుతం దేశానికి బలమైన ప్రత్యామ్నాయం అవసరం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కూటమి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పోరాడుతుంది. పొత్తుల వల్ల బీజేపీ లెక్కలు తప్పుతాయి' అని పాఠక్ అన్నారు.
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దిల్లీలోని మొత్తం 7 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు పర్యాయాలు ఆప్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక 2009లో కాంగ్రెస్ మొత్తం 7 సీట్లు గెలుచుకుంది. అంతకుముందు 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 6 సీట్లు రాగా, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది.
టీఎంసీ డైలమాలో పడింది : కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆప్, సమాజ్వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు ఒప్పందాలు చేసుకున్న కాంగ్రెస్కు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో చిక్కొచ్చి పడింది. టీఎంసీతో సీట్ల సర్దుబాటు చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇది కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ పార్టీల నేతలు పరస్పరం విమర్శలు కూడా చేసుకున్నారు. తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ బంగాల్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ డైలమాలో ఉందని చెప్పారు.
"వారు (టీఎంసీ) నేతలు డైలమాలో ఉన్నారు. వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అధికారింకంగా కూటమిలో ఉండడం లేదు అని కూడా చెప్పడం లేదు. ఎందుకంటే వారు డైలమాలో ఉన్నారు. మొదటి డైలమా ఏంటంటే, ఇండియా కూటమి మద్దతు లేకుండా తాము ఒంటరిగా పోటీ చేస్తే, మైనారిటీ వర్గాలు తమకు ఓటు వేయవని టీఎంసీలోని కొందరు భావిస్తున్నారు. ఇక మరో వర్గం కూటమిలో ఉండాలనుకుంటోంది. బంగాల్లో పొత్తుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మోదీ ప్రభుత్వం తమపై ఈడీ, సీబీఐని ప్రయోగిస్తుందని మరో వర్గం ఇంకో డైలమాలో పడింది. ఈ డైలమాల వల్లనే టీఎంసీ సరైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. అయితే ఈ విషయంపై దిల్లీలో చర్చలు జరగుతున్నాయి కావచ్చు. దాని గురించి నాకు సమాచారం లేదు"
--అధీర్ రంజన్, కాంగ్రెస్ బంగాల్ అధ్యక్షుడు
రైతుల దిల్లీ చలోకు బ్రేక్- కొవ్వొత్తుల ర్యాలీ, కేంద్రం దిష్టి బొమ్మలు దహనం
'కాంగ్రెస్తో పొత్తు లేదు- బైనాక్యులర్తో వెతికినా వారికి మూడో సీటు దొరకదు'