ETV Bharat / bharat

ప్రధాని మోదీపై ఈసీకి మళ్లీ కాంగ్రెస్ ఫిర్యాదు- చర్యలు ఉంటాయా? - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 5:55 PM IST

Updated : Apr 22, 2024, 6:13 PM IST

Complaint To EC On Modi
Complaint To EC On Modi

Complaint To EC On Modi : సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీపై మరోసారి ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని జాలోర్‌లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.

Complaint To EC On Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని జాలోర్‌లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి ఆయన హోదాకు తగవని ఈసీ అధికారులకు తెలిపింది. ఓ వర్గం ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నేతల బృందం అభిప్రాయపడింది.

అలాంటి వ్యాఖ్యలను అన్ని పార్టీలు ఖండించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మోదీకి సూచనలు చేయాలని ఈసీని కోరింది. ఈ అంశంపై సోమవారం మధ్యాహ్నం ఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయిన కాంగ్రెస్ నేతల బృందానికి సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ సారథ్యం వహించారు. ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం తర్వాత పూర్తి వివరాలను అభిషేక్ మను సింఘ్వీ మీడియాకు తెలియజేశారు.

చేతులెత్తి మొక్కుతున్నాం.. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి : సింఘ్వీ
"దేశ ప్రధాన మంత్రిగా మోదీని మేం గౌరవిస్తాం. ఎంత పెద్ద పదవిలో ఉంటే బాధ్యత అంతగా పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా పదాలను వాడాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ రాజస్థాన్ ప్రచార సభలో అలాంటి దారుణ వ్యాఖ్యలు చేస్తారని మేం ఊహించలేదు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చేతులు జోడించి ఆయనను కోరుతున్నాం" అని అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.

"ప్రధాని మోదీ ప్రసంగంలోని నాలుగైదు అంశాలపై మాకు తీవ్ర అభ్యంతరం ఉంది. మొదటిది ఆయన ప్రసంగంలో ఓ వర్గం పేరును ప్రస్తావించారు. ఆ వర్గం వారిని కించపరిచేలా మాట్లాడారు. ఆ వర్గానికే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయనే తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఆ మైనారిటీ వర్గానికి నిధుల కేటాయింపు వల్ల మెజారిటీ వర్గానికి అన్యాయం జరుగుతోందనే భ్రమను ప్రజల్లో కల్పించారు. హిందూ వర్గానికి అద్దంపట్టే మంగళసూత్రాన్ని ప్రసంగంలో ప్రస్తావించడం ద్వారా మతపరమైన అంశాన్ని ఎన్నికల ప్రచారంలో మోదీ వాడారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధం" అని అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. "ఎన్నికల కోడ్ నిబంధనలను అందరికీ వర్తింపజేసినట్టే.. ప్రధాని మోదీకి కూడా వర్తింపజేయాలి. హోదాను పట్టించుకోకుండా తప్పును తప్పుగా చూసి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. ఈ వివరాలన్నీ తాము ఈసీ అధికారులకు అందించామని చెప్పారు సింఘ్వీ.

బీజేపీపై మరో 16 ఫిర్యాదులు
ప్రధాని మోదీపై ఫిర్యాదుతో పాటు కాంగ్రెస్ ప్రతినిధి బృందం బీజేపీపై మరో 16 ఫిర్యాదులను కూడా సమర్పించింది. వీటిపై విచారణ జరిపి అధికార పార్టీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌(యూజీసీ)లో సభ్యుల పోస్టులు 2023 ఆగస్టు నుంచి ఖాళీగా ఉంటే.. ఎన్నికల వేళ భర్తీ చేయడంపైనా ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

Last Updated :Apr 22, 2024, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.