Teachers working with students: పుస్తకం, పెన్ను పట్టుకొని చక్కగా చదువుకోవాల్సి పాఠశాల విద్యార్థులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో గోడలు ఎక్కి వాటర్ పైప్తో ఇలా గోడలు తడుపుతున్న దృశ్యాలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనిపించాయి. పాఠశాలలో గత కొద్ది రోజుల క్రితం అదనపు గదుల నిర్మాణం చేపట్టగా.. వాటికి ఆ స్కూల్ విదార్థులే నిత్యం వాటర్రింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు కావడంతో ఉదయం 8గంటల ముందే స్కూల్కు వచ్చి ప్రమాదకర పరిస్థితుల్లో గోడలు ఎక్కి మరి విద్యార్థులు నీరు కొడుతున్నారు. ఇందుకు కూలీ పనులు చేసేవారు.. ఉంటారు కదా మీరు ఎందుకు నీళ్లు కొడుతున్నారని కొందరు స్థానికులు ప్రశ్నించగా.. అందుకు పిల్లల నుంచి ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. మా పెద్ద సార్ ఇలా వాటర్ కొట్టమన్నారని.. స్కూల్కు ఎవరు ముందు వస్తే వాళ్లు వాటర్ కొడతారని తెలిపారు. చదవు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలా పిల్లలతో పనులు చేయించడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి.