RPF constable saved women passenger at Begumpet Railway Station : సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద కదులుతున్న రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయిన మహిళ ప్రయాణికురాలిని రైల్వే రక్షక దళం పోలీసులు రక్షించారు. రైలు కింద పడబోతుండగా సరస్వతి అనే ప్రయాణికురాలిని మహిళ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సరిత సురక్షితంగా కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం లింగంపల్లి నుంచి ఫలక్నుమా వేళ్లే ఎంఎంటీఎస్ రైలు బేగంపేట రైల్వే స్టేషన్లో ఆగింది. కొద్దిసేపటికి ఆ రైలు కదులుతుండగా సరస్వతి అనే ప్రయాణికురాలు రైలు ఎక్కే క్రమంలో అదుపుతప్పి పడిపోయారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షక దళానికి చెందిన మహిళ పోలీస్ కానిస్టేబుల్.. సరిత హుటాహుటిన సరస్వతిని అక్కడి నుంచి లాగేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో బాధితురాలు ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సరితను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.