Prathidwani Debate on Digital Personal Data Protection Bill: ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయాలి. ప్రజల పట్ల జవాబుదారీతనంతో మెలగాలి. తన విధానాలను సమీక్షించేందుకు, విమర్శించేందుకు జనసామాన్యానికి వీలు కల్పించే సమాచారాన్ని తొక్కిపట్టకూడదు. కాబట్టే, పార్లమెంటుకు లేదా రాష్ట్ర శాసనసభకు ఇవ్వదగిన ఎటువంటి వివరాలనైనా సరే- భారతీయ పౌరులందరికీ అందించవచ్చునని సమాచార హక్కు చెబుతోంది. కానీ ఆ లక్ష్యం మన పాలకుల కారణంగా నీరుగారిపోతోంది. ఇది చాలదన్నట్టు తాజాగా లోక్సభ ఆమోదం పొందిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులోని కొన్ని క్లాజుల వల్ల సమాచార హక్కు చట్టం అస్తిత్వానికి నష్టం కలగబోతోందనే ఆందోళన ఉంది. విశాల ప్రజాప్రయోజనాలకు మేలు చేసే వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ పరచవచ్చన్నది ఆర్టీఐ శాసనంలోని సెక్షన్ 8(1)(జె) సారాంశం. డేటా బిల్లు ద్వారా దీన్ని సవరించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. స.హ.చట్టం పరిధిలోంచి వ్యక్తిగత సమాచారానికి అది పూర్తిగా మినహాయింపునిచ్చేస్తోంది! వ్యక్తులు, సంఘాలు, సంస్థలతో పాటు రాజ్యాన్ని సైతం ‘పర్సన్’గానే డేటా బిల్లు నిర్వచిస్తోంది. దానిమూలంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఇకపై సమాచారం వెలుపలికి రావడమే గగనం అవుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే వ్యక్తుల గోప్యతను కచ్చితంగా కాపాడాల్సిందే.. కానీ దాని పేరు మీద మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించడం వల్ల ప్రజా ప్రయోజనాలకు వాటిల్లే ఎలాంటి నష్టం కలుగుతుంది? తమనెవరూ ప్రశ్నించకూడదన్న నిరంకుశ వైఖరి ప్రభుత్వాల్లో కనిపిస్తోందా? ప్రశ్నించేతత్వాన్ని నాయకులు, అధికారులు సహించలేకపోతున్నారా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం.