Prasanth reddy Review Meeting : జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిజామాబాద్ జిల్లా అన్ని శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 22 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల కార్యక్రమాలను రోజుకి ఒక శాఖ దినోత్సవంగా నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
జూన్ మూడో తేదీన రైతు దినోత్సవం అయినందున జిల్లాలో ఉన్న అన్ని రైతు వేదికల దగ్గర ఉత్సవాలు జరగాలని చెప్పారు. వేదికల దగ్గరల్లో రైతులకు ప్రభుత్వం అందించిన పథకాలను అన్నింటిని వివరిస్తూ ఫ్లెక్సీలను తయారు చేసి.. ప్రదర్శించాలని ఆదేశించారు. దీంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్ ద్వారా ఏ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టిందనే విషయం తెలిసేలా.. ఫ్లెక్సీలను పెట్టాలని అన్నారు. ఆ రోజు ఏ శాఖ ఎలాంటి పని చెయ్యాలో తెలిపారు.