rescue at Jadi Malkapur waterfall in Sangareddy : ప్రకృతి ఎంత నయనాందకరంగా ఉంటుందో.. అంతకన్నా ప్రమాదకరమైంది కూడా. పర్యటక ప్రాంతాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించడమే మనకు శ్రేయస్కరం. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లా జాడి మల్కాపూర్ జలపాతానికి వరద పోటెత్తింది. కొండలపై నుంచి జారిపడుతున్న ప్రవాహం చూపరులను మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఆదివారం కావడంతో జలపాతం వద్దకు.. స్థానికులతో పాటు హైదరాబాద్, బీదర్ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు వస్తున్నారు. జాలు వారుతున్న నీటి అందాలను దగ్గర నుంచి చూసేందుకు ఓ వ్యక్తి, తన కుమారుడితో కలిసి నీళ్లలోకి దిగాడు. నీటి ఉద్ధృతి తట్టుకోలేక.. ప్రవాహంలో కొట్టుకుపోసాగారు. కళ్ల ముందే కొట్టుకుపోతున్న తండ్రి, కుమారుడిని గుర్తించిన సమీప పర్యాటకులు హుటాహుటిన నీళ్లలోకి దిగి వారిని రక్షించారు. ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారంతపు సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే జలపాతం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం తలెత్తకుండా.. జలపాతం లోతు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.