Harish Rao Praises Ramoji Rao : సామాజిక సేవలో భాగంగా రామోజీ ఫౌండేషన్... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో తహశీల్దార్, ఇబ్రహీంపట్నంలో ఆర్డీవో కార్యాలయాలను నిర్మించింది. సుమారు 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. విపత్తుల వేళ, బాధితుల పక్షాన నిలిచే రామోజీ సంస్థలు... ప్రభుత్వానికి తోడ్పాడునందించేలా కార్యాలయాల్ని నిర్మించటం అభినందనీయమని మంత్రి అన్నారు.
Harish Rao about Ramoji Foundation : బాధితుల పక్షాన నిలిచి సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే రామోజీ ఫౌండేషన్(Ramoji Foundation... మరో రెండు ప్రభుత్వ కార్యాలయాల్ని నిర్మించింది. ఏడాది క్రితమే రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపుర్మెట్లో రూ.3కోట్లతో ఆధునాతన హంగులు, సకల సౌకర్యాలతో పోలీస్స్టేషన్ను నిర్మించిన రామోజీ ఫౌండేషన్... పక్కనే తహశీల్దార్ కార్యాలయాన్నీ అందుబాటులోకి తెచ్చింది. రూ.2 కోట్ల 25లక్షలతో నిర్మించిన కార్యాలయాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ , రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి , జిల్లా కలెక్టర్ ఎస్ .హరీశ్ , ఆర్టీవో అనంతరెడ్డి, ఎమ్మార్వో అశోక్రెడ్డి పాల్గొన్నారు. సమాజ సేవలో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్(Etv Bharat) ఎప్పుడూ ముందుంటాయన్న హరీశ్ రావు... రామోజీ గ్రూప్ సంస్థలకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అబ్దుల్లాపూర్మెట్లో తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం...ఇబ్రహీంపట్నంలో రామోజీ ఫౌండేషన్ నూతనంగా నిర్మించిన ఆర్టీవో కార్యాలయాన్ని మంత్రి హరీశ్రావు అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో రూ.2కోట్ల 25 లక్షల వ్యయంతో రామోజీ ఫౌండేషన్ ఈ కార్యాలయాన్ని నిర్మించింది. కార్యాలయ ప్రారంభోత్సవంలో హరీశ్రావుతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఆర్టీవో అనంతరెడ్డి పాల్గొన్నారు.