తెలంగాణ

telangana

Yadadri Gold: యాదాద్రి విమాన గోపురానికి వెల్లువలా విరాళాలు

By

Published : Oct 20, 2021, 10:59 PM IST

Yadadri

యాదాద్రి విమాన గోపురానికి విరాళాలు (Gold Donation For Yadadri) వెల్లువెత్తుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విరాళం అందించగా... తాజాగా ఇవాళ పలు సంస్థలు, ప్రముఖలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం కోసం విరాళాలు (Gold Donation For Yadadri) వెల్లువలా వస్తున్నాయి. బంగారు తాపడం కోసం 6 కిలోల బంగారాన్ని అందించనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌స్ట్రాక్చర్స్‌ లిమిటెడ్‌- (MEIL) డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుడి.. ఆలయ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ (Cm Kcr) పిలుపు మేరకు ముందుకొచ్చినట్లు మేఘా సంస్థ ప్రకటించింది.

శ్రీలక్ష్మీనరసింహ త్వరలోనే ఆరు కిలోల బంగారం కానీ... అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో కానీ అందిస్తామని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్రకుమార్‌ కామరాజు యాదాద్రి విమాన గోపురం కోసం రెండు కిలోల బంగారం విరాళం ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎన్​వీ రామరాజు.. జలవిహార్ తరపున కిలో బంగారాన్ని అందిస్తామని ప్రకటించారు.

తొలి విరాళం సీఎందే...

యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం విరాళమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr Gold Donation For Yadadri) ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి భారీగా బంగారం అవసరమని సీఎం తెలిపారు. విమాన గోపురానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విమాన గోపురానికి దాతలు బంగారం విరాళం ఇస్తామని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.

భూరి విరాళాలు...

సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి ఆలయానికి ప్రజాప్రతినిధులు భూరి విరాళాలు ప్రకటించారు. మేడ్చల్, రంగారెడ్డి తెరాస ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. యాదాద్రి ఆలయానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు గాంధీ, హన్మంతరావు కృష్ణారావు, వివేక్ ఆనంద్ కిలో చొప్పున బంగారం విరాళం ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి హరీశ్‌రావు కిలో బంగారం విరాళం ప్రకటించారు. హెటిరో ఛైర్మన్‌ పార్థసార‌థి.. యాదాద్రికి 5 కిలోల బంగారం విరాళం ప్రకటించారు.

ముహూర్తం ఖరారు...

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారైంది. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నామన్న సీఎం కేసీఆర్.. అంతకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం చేయనున్నట్లు ప్రకటించారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పలుకుతామని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ మూహూర్తం చినజీయర్ స్వామి నిర్ణయించారన్నారు.

ఇదీ చూడండి: Kcr Gold Donation For Yadadri: 'యాదాద్రికి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం ఇస్తా'

ABOUT THE AUTHOR

...view details