తెలంగాణ

telangana

కేటీపీపీ వ్యర్థాలతో బతుకులు ఆగం.. వారి గోస ఆలకించే వారు ఎవరు?

By

Published : Oct 16, 2022, 5:19 PM IST

Villagers of Dubbapally are suffering from KTPP waste: కర్మాగారం నుంచి వచ్చిన వ్యర్ధాలు.. పంట పొలాలను విషమయం చేస్తున్నాయి. కలుషిత జలాలను తాగిన పశువులు.. వ్యాధుల బారిన పడి చనిపోతున్నాయి. పరిసర ప్రాంత ప్రజలు దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్నారు. తమ గ్రామాన్ని వేరేచోటికి తరలించాలని.. గ్రామస్థులు వేడుకుంటున్నా.. వారి గోస ఆలకించే వారే కరవయ్యారు.

KTPP waste
KTPP waste

Villagers of Dubbapally are suffering from KTPP waste: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారు దుబ్బపల్లి గ్రామమిది. 400 కుటుంబాలు ఉండే ఈ ఊరిలో ఏ ఒక్కరిలోనూ సంతోషం మచ్చుకైనా కనిపించదు. అందుకు కారణం పంట పొలాలు బీడు బారడమే. కాకతీయ ధర్మల్ పవర్ ప్లాంట్-కేటీపీపీ నుంచి వచ్చే రసాయనాల తాలూకు వ్యర్ధాలను మోరంచ వాగులోకి వదులుతున్నారు. ఫలితంగా వాగు నీటితో సాగయ్యే పంటపొలాలు మోడుబారిపోతున్నాయి.

కేటీపీపీ వ్యర్థాలతో బతుకు ఛింద్రం.. వారి గోస ఆలకించే వారు ఎవరు?

వ్యర్థజలాలు తాగి పశువులు మృతి: గతంలో ఈ వ్యర్ధజలాలను కొంపెల్ల చెరువులోకి వదలగా.. చేపపిల్లలు చనిపోతున్నాయంటూ మత్స్యకారులు అభ్యంతరం చెప్పడంతో.. ఆ నీటిని మోరంచ వాగువైపునకు మళ్లిస్తున్నారు. ఫలితంగా తమ పంటలు సరిగ్గా పండట్లేదని దుబ్బపల్లి గ్రామ రైతులు వాపోతున్నారు. తాము రోగాల బారినపడుతున్నారని.. పశువులు చనిపోతున్నాయని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని, పొలాలను తామే తీసుకుంటామని జెన్‌కో.. పదేళ్ల క్రితమే చెప్పినా.. రెవెన్యూ శాఖ తీరుతో అది ఆచరణలోకి రావట్లేదు.

కలుషిత జలాలకు పంటలు సర్వనాశనం:సమస్యను అర్ధం చేసుకుని పరిష్కారానికి ఉపక్రమించేలోపే.. అధికారులు మారడంతో సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. వర్షాలు పడుతున్న సమయంలో వ్యర్థ జలాల సమస్య మరీ ఎక్కువుగా ఉంటోంది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు కలుషిత జలాల కారణంగా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయని దుబ్బపల్లి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం, జెన్‌కో అధికారులు ఇప్పటికైనా స్పందించి.. తమకు న్యాయం చేయాలని.. ఆరుగాలం పడిన కష్టం.. బూడిద పాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details