justice nv ramana in Suryapet : సూర్యాపేటలో సీజేఐ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అల్పాహారం తీసుకున్నారు. విజయవాడకు వెళ్తూ మార్గంమధ్యలో కుటుంబసభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. సీజేఐ రాకను పురస్కరించుకుని జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేటకు చేరుకున్న ఆయనకు పలువురు న్యాయమూర్తులు, కలెక్టర్ స్వాగతం పలికారు.
సీజేఐ రాక సందర్భంగా సూర్యాపేట జిల్లా యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా పోలీసుల నుంచి సీజేఐ గౌరవ వందనం స్వీకరించారు. అల్పాహార విందు ముగించుకుని వెళ్తున్న సీజేఐతో కలిసి ఫోటో దిగేందుకు హోటల్ సిబ్బంది, పోలీసులు అభ్యర్థించారు. వారితో ఫొటోలు దిగేందుకు ఆయన అనుమతించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సతీష్ శర్మ , జిల్లా జడ్జి బీఎస్.జగజీవన్ కుమార్, రెండో మెట్రోపాలిటన్ న్యాయమూర్తి వసంత పాటిల్, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కె. సురేష్, అడిషినల్ జూనియర్ జడ్జి ప్రశాంతి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్వాగతం పలికారు.
సీజేఐకు సాదర స్వాగతం
justice nv ramana AP Tour: సీజేఐగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా స్వగ్రామం వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణకు సాదర స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గరికపాడు చెక్పోస్టు వద్దకు చేరుకోగానే.... కృష్ణా జిల్లా యంత్రాంగం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. జిల్లా కలెక్టర్ నివాస్, పలువురు మహిళలు.... ఆయకు ఆహ్వానం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో, మేళతాళాల నడుమ స్వాగతం పలికారు. మహిళలు జాతీయజెండా చేతబూని... సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు అభివాదం తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రవీంద్రబాబు, రిజిస్ట్రార్ గిరిధర్, లా సెక్రటరీ సునీత, నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్డి బి. శ్రీనివాస్, డీఐజీ రాజశేఖర్బాబు, స్త్రీ సంక్షేమ శాఖ కమిషనర్ కృతిక శుక్లా సహా పలువురు ఆయనకు స్వాగతం పలికారు.
ఇదీ చదవండి:Omicron cases in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసులు