Nagarjunasagar Buddhavanam: బుద్ధుడు గతించిన రెండు శతాబ్దాల తర్వాత జరిగిందది... అప్పటికే తథాగతుడు ప్రవచించిన బౌద్ధ సిద్ధాంతం చిలవలుపలవలైంది. బుద్ధుడి బోధనలని ఏ సంఘానికా సంఘం కొత్తగా నిర్వచించుకోవడం మొదలుపెట్టాయి. వాటిల్లో హీనయాన సిద్ధాంతానిదే ఆధిక్యం. ‘బుద్ధుడు మహిమలున్న దేవుడు కాదు... ఓ మామూలు మనిషే. హిందూమతంలా భక్తివద్దు... ఆయన సిద్ధాంతాలని మాత్రం పాటిస్తే చాలు’ అన్నది దాని సారాంశం. దానికి వ్యతిరేకంగా ‘ఆ సిద్ధాంతాలు మేధావులకి బావుండొచ్చు. మరి సామాన్యుల సంగతేమిటీ... వాళ్లకి దేవుడు కావాలి... వాళ్ల కష్టసుఖాలు వినే రూపం ఒకటి ఉండాలి!’ అని నినదించింది.
మహాయాన సిద్ధాంతం. దాన్ని తన ‘శూన్యవాదం’తో ప్రపంచానికి గట్టిగా చాటినవాడు ఆచార్య నాగార్జునుడు. గమ్మత్తుగా, బుద్ధుడు దేవుడేనన్న వాదనే ప్రపంచానికి నచ్చింది. నాగార్జునుడున్న నందికొండకి దక్షిణాసియా నలుమూలల నుంచి ఎంతో మంది శిష్యుల రాక మొదలైంది. ఇటు చైనా నుంచి అటు ఆఫ్ఘనిస్థాన్దాకా వాళ్లే బౌద్ధాన్ని తీసుకెళ్లారు. మనదేశంలో బౌద్ధం క్షీణించాక... ఒకప్పుడు నాగార్జునుడి ఆరామమైన నందికొండ తన ప్రాబల్యం కోల్పోయి మట్టిదిబ్బగా మిగిలింది.
నాగార్జునసాగర్ నిర్మాణంతో ఇందులోని చాలాభాగం నీట మునిగింది. మిగిలి ఉన్న వాటిని భద్రపరిచేందుకు నాగార్జునకొండలో ఓ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. దాంతోపాటూ కృష్ణానది ఎడమగట్టున ఇక్కడి నాగార్జునుడి గుర్తుల్ని శాశ్వతం చేసేలా ఓ ‘బుద్ధవనం’ నిర్మించాలన్న ఆలోచనకి 2004లో బీజం పడింది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ పర్యటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం ఇక్కడ 274 ఎకరాలు కేటాయించి దీనికి శంకుస్థాపన చేసింది. కానీ ప్రభుత్వాలు మారడంతో... ఈ ప్రాజెక్టు నత్తనడక నడిచింది. 2015లో తెలంగాణ ఆవిర్భావంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి మళ్ళీ ఊపిరిపోసింది.
అడుగడుగునా శిల్పకళా సంపద..:ఈ ప్రాజెక్టు కోసం మయన్మార్, థాయ్లాండ్, శ్రీలంకల నుంచి బౌద్ధ శిల్పుల్ని రప్పించి అడుగడుగునా కళాకృతులతో తీర్చిదిద్దారు. బౌద్ధ భిక్షువులకు స్వాగతం పలకడానికి పదెకరాలలో ప్రవేశద్వారాన్ని నిర్మించారు. సుమారు 25 వేల గ్రానైట్ రాళ్లతో నడకదారిని నిర్మించారు. ద్వారపాలకులుగా ఏనుగుల విగ్రహాలనూ దమ్మచక్రాన్నీ రూపుదిద్దారు. బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గాలకి గుర్తుగా ఇక్కడున్న 274 ఎకరాలని ఎనిమిది వనాలుగా తీర్చిదిద్దుతున్నారు. వాటిల్లో ఐదు వనాలు- స్తూపవనం, జాతకవనం, బుద్ధచరిత వనం, ధ్యానవనం, మహాస్తూపం పనులు 90 ఎకరాల్లో పూర్తయిపోయాయి. దిగువ కృష్ణలోయ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధమత విశేషాలని చాటే వనం, తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధమత ప్రదేశాల నమూనాలను పూర్తి వివరాలతో చూపే ప్రత్యేక వనం, ఆచార్య నాగార్జున అంతర్జాతీయ ఉన్నత విద్యా పరిశోధనా కేంద్రాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు తప్పకుండా చూసి తీరాల్సిన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.