గుడ్న్యూస్.. మూడు రోజులు ముందే వచ్చిన రుతుపవనాలు
Updated on: May 29, 2022, 12:52 PM IST

గుడ్న్యూస్.. మూడు రోజులు ముందే వచ్చిన రుతుపవనాలు
Updated on: May 29, 2022, 12:52 PM IST
Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Monsoon in Kerala: దేశంలో భానుడి భగభగలు కొనసాగుతున్న వేళ.. భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు వెల్లడించింది. సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే కేరళను రుతుపవనాలు పలకరించినట్లు వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని.. వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది త్వరగా భారత్లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈసారి ముందుగానే అవి వస్తున్నట్టు వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది. మే 27నే ఇవి కేరళకు చేరుకుంటాయని అంచనా వేసింది. అయితే, చెప్పిన సమయానికి నాలుగు రోజులు తేడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు గత నెలలో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు చెప్పారు. సాధారణం కంటే చాలా ముందుగానే(మే 16నే) అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం 'కేజీఎఫ్' ప్లాన్.. వర్కౌట్ అయితే కనక వర్షమే!
