తెలంగాణ

telangana

CLP Bhatti Vikramarka : 'ఏదో రోజు.. తెలంగాణను ఏ రాష్ట్రానికో తాకట్టు పెట్టేస్తారు'

By

Published : May 3, 2023, 12:53 PM IST

Bhatti Vikramarka Padayatra in Yadadri: తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే.. మళ్లీ ఇందిరమ్మ రాజ్యమే రావాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పీపుల్స్​ మార్చ్​ పాదయాత్రలో భాగంగా ఆయన మంగళవారం రాత్రి యాదాద్రి చేరుకున్నారు. అక్కడ ప్రసంగించిన భట్టి.. కేసీఆర్​ను గద్దె దించకపోతే ఏదో ఓ రోజు తెలంగాణను ఏ రాష్ట్రానికో తాకట్టు పెట్టేస్తారని విమర్శించారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka

తెలంగాణను కాపాడాలంటే.. ఇందిరమ్మ రాజ్యమే రావాలి

Bhatti Vikramarka Padayatra in Yadadri: ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. దాని కోసమైనా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామని కాంగ్రెస్​ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్​ మార్చ్​ కార్యక్రమంలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రికి యాదాద్రి చేరుకుంది. ఈ ప్రాంతానికి చేరుకోగానే.. కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాతగుట్ట కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Bhatti Comments on CM KCR : ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ పేదల దేవుడైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ఖరీదైన దేవుడిగా మార్చారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వారిని సామాన్య ప్రజలకు దూరం చేశారని మండిపడ్డారు. యాదాద్రి దేవుడి దగ్గరకి కారులోనే భక్తులు రావాలని.. సామాన్యులు ఎక్కే ఆటోలు పనికి రావని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఆరోపణలు చేశారు. ఈ కొండపైకి ఆటోలను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం.. 300 మంది ఆటో కార్మికుల పొట్ట కొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అందుకే ఈ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. ఆటోలను కొండపైకి అనుమతిస్తామని మాటిచ్చారు. ఆ మాటలకు కట్టుబడి ఉంటామని భట్టి స్పష్టం చేశారు.

అభివృద్ధి అంటే ప్రజల జీవన స్థితిగతులు మార్చాలే కాని.. షాపులను తొలగించి, ఆటోలను నడపకుండా చేయడం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి భట్టి హితవు పలికారు. యాదాద్రిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే యాదాద్రి కొండపై భక్తులు బసచేయడానికి అవకాశం లేకుండా చేశారని భట్టి ధ్వజమెత్తారు. రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని.. యాదాద్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్​, పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు బండ్రు శోభా రాణి, కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నాయకులు పాదయాత్రతో పాటు.. కార్యక్రమంలో పాల్గొన్నారు.

"తప్పని సరిగా ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోపోతే.. ఈ రాష్ట్రం ఇప్పటికే రూ. 5 లక్షల కోట్లు అప్పుల పాలైపోయింది. హైదరాబాద్​ చుట్టూ ఉన్న భూములు అన్నింటిని అమ్మేస్తామని చెప్పారు. అవుటర్​ రింగ్​ రోడ్డును 30 సంవత్సరాలకు లీకేజీకి ఇచ్చారు. తెలంగాణను ఏ రాష్ట్రానికో తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details