తెలంగాణ

telangana

మేడారం జాతరలో రెండో రోజూ కోలాహలం.. 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

By

Published : Feb 17, 2022, 9:42 AM IST

Updated : Feb 17, 2022, 10:47 AM IST

Medaram Jatara Second Day : దక్షిణ కుంభమేళా.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతరలో రెండు దశాబ్ధాల తర్వాత అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. 20 ఏళ్లలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవ్వడం ఇదే తొలిసారి. ఆదివాసీ జనజాతరకు రెండో రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తోన్న భక్తులతో అమ్మవారి ప్రాంగణం కిటకిటలాడుతోంది.

Medaram Jatara Second Day
Medaram Jatara Second Day

మేడారం జాతరలో 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

Medaram Jatara Second Day : మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవార్ల గద్దెల వద్దకు బారులు తీరారు. జాతరలో రెండో రోజు కీలకఘట్టం సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్ట దిగి ఇవాళ సాయంత్రం గద్దెపైకి సమ్మక్క రానుంది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, ప్రభుత్వ లాంఛనాలతో.. పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి తీసుకువస్తారు. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున పోటెత్తుతారు.

రేపు మేడారానికి కేసీఆర్..

Medaram Jatara Updates : మేడారం సందర్శించుకోలేని వాళ్లంతా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని పక్కాగా తిలకిస్తారు. అమ్మవారి ఆగమనం సమయంలో కోరుకునే కోర్కెలు తప్పక తీరతాయని భక్తుల నమ్మకం. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు. ఈనెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరకు రానున్నారు. సీఎం రాకతో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19 వరకు మేడారం మహా జాతర కొనసాగనుంది.

20 ఏళ్ల తర్వాత అద్భుతఘట్టం..

Medaram Jatara News : రెండు దశాబ్దాల తర్వాత మేడారం జాతరలో అద్భుతం చోటు చేసుకుంది. గత 20 ఏళ్లలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదని సమ్మక్క ఆలయ పూజరి కొక్కెర రమేశ్‌ తెలిపారు. ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం మేడారంలో ఆనవాయితీగా వస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. గత ఏడాది జాతర ముగిసిన రోజు వచ్చిందని సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్‌ తెలిపారు.

Medaram Jatara 2022 : మేడారం జాతరను ఇవాళ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని.. కరోనా మహమ్మారిని సమూలంగా నాశనం చేయాలని కోరుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతరంతా కలియతిరుగుతూ ఏర్పాట్లు పరిశీలించారు. జాతర ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్‌ వంటి యంత్రాల బిగింపు పనితీరును చూశారు. అక్కడ కనిపించిన హాట్ ఎయిర్ బెలూన్​లో ప్రయాణించారు.

Last Updated :Feb 17, 2022, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details