తెలంగాణ

telangana

చివరి ఆయకట్టుకు అందని సాగునీరు.. అన్నదాతల్లో ఆందోళన

By

Published : Feb 26, 2023, 9:52 AM IST

Crops Drying Due To Lack Of Water In Alampur: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు ఎండిపోతోంది. తుంగభద్రలో నీటి లభ్యత లేక ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నైనా సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏటా యాసంగిలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని, శాశ్వత పరిష్కారంగా తుమ్మిళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మూడు జలశాయ నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

Tummilla lift irrigation project
Tummilla lift irrigation project

చివరి ఆయకట్టుకు అందని సాగునీరు.. అన్నదాతల్లో ఆందోళన

Crops Drying Due To Lack Of Water In Alampur: జోగులాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద యాసంగిలో సాగుచేసిన చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద అలంపూర్ నియోజక వర్గంలో 27,000 ఎకరాల్లో మొక్కజొన్న, 8,000 ఎకరాల్లో వరి, 2,000 ఎకరాల్లో జొన్న, వేరుశనగ.. 1,000ఎకరాల్లో ఆముదం సాగుచేశారు. జనవరి నుంచి తుమ్మిళ్ల ఆయకట్టుకు అధికారులు వారాబంధీ పద్ధతిలో ఆరుతడి పంటలకు సాగునీరు అందిస్తున్నారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి: అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో నామమాత్రంగా ఉండటంతో ఎగువ రైతులకే విడుదలైన సాగునీరు అందుతోంది. మానవపాడు, ఉండవల్లి, అలంపూర్ మండలాల చివరి ఆయకట్టుకు నీరందక పోవడం అన్నదాతలుకు ఇబ్బందిగా మారింది. అలంపూర్​లో ఎత్తిపోతల పథకాలు ఉండటంతో అక్కడి రైతులు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. కాని ఉండవల్లి, మానవపాడు మండలాలకు ఎలాంటి ఎత్తిపోతల పథకాలు లేకపోవడంతో తుమ్మిళ్ల ఎత్తిపోతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజోలి బండ డైవర్షన్ స్కీం లోని 12వ డిస్ట్రిబ్యూటరీ నుంచి 38వ డిస్టిబ్యూటరీ వరకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా 55,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. యాసంగిలో వారాబంధీ విధానంలో జనవరి నుంచి మార్చి15 వరకూ ఆరుతడి పంటలకు సాగునీరు ఇస్తామని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ మూడుసార్లు నీళ్లు విడుదల చేయగా.. ఆఖరుసారి మాత్రం చివరి ఆయకట్టుకు నీరు అందలేదు.

ఇంకా మూడు నుంచి ఐదు తడులు ఇస్తే తప్ప పంటలు బతికే పరిస్థితి లేదు: తుంగభద్రనదిలో నీటి లభ్యత లేకపోవడంతో నీళ్లు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా మూడు నుంచి ఐదు తడులు ఇస్తే తప్ప పంటలు బతికే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మిళ్ల నుంచి నీళ్లు విడుదల చేయకపోతే ఎగువన ఉన్న వడ్డేపల్లి, అయిజ, రాజోలి మండలాల్లోని.. వరి సహా ఇతర పండ్లతోటలు కూడా నీటి ఎద్డడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ కాల్వలకు నీళ్లు ఎత్తిపోసే పనులు మాత్రమే పూర్తి చేశారు. కానీ ఈ పథకం కింద ఇంకా 3 రిజర్వాయర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. నీటి లభ్యత ఉన్నప్పుడే తుంగభద్ర నుంచి నీళ్లు ఎత్తిపోసుకుని ఈ జలాశయాలను నింపడం ద్వారా రెండు పంటలకు నీళ్లు అందించవచ్చు. కాని మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణం జరక్కపోవడంతో ఏటా చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు.

సుంకేసుల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉంటే వెనక జలాల ద్వారా తుమ్మిళ్లకు నీరందే అవకాశం ఉంది. లేదంటే జూరాల లింక్‌ కెనాల్‌ ద్వారా నైనా మార్చి మాసాంతం వరకు నీరందించాలని కర్షకులు కోరుతున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద జలాశయాల నిర్మాణం పూర్తి చేసి ఏటా రెండు పంటలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

"పంట చేతికి వచ్చే సమయానికి నీరు రావడం లేదు. తద్వారా పంటలు ఎండిపోతున్నాయి. ఇంకా మూడు నుంచి ఐదు తడులు ఇస్తే తప్ప పంటలు బతికే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సాగునీరు అందించాలని కోరుతున్నాం." -బాధిత రైతులు

ఇవీ చదవండి:తామర పురుగు తాకిడి.. మామిడి రైతుకు దోపిడి

తెలంగాణలో పేదల ప్రభుత్వం తీసుకువస్తాం : బీజేపీ

'మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే ఆత్మహత్యకు అనుమతివ్వండి'.. ఉల్లిరైతుల వినతి!

ABOUT THE AUTHOR

...view details