తెలంగాణ

telangana

అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తాం: రేవంత్‌

By

Published : Mar 5, 2023, 2:57 PM IST

Revanth Reddy Fires On CM KCR: అధికారంలోకి రాగానే ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాలలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. 2018లో ప్రాజెక్టుకు హరీశ్‌రావు శిలాఫలకం వేసినా.. నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. ఉమ్మడిపాలనలో ప్రాజెక్టులపై చూపించే వివక్షే.. సీఎం కేసీఆర్‌ చూపిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేకు ఇక్కడి సమస్యలపై అవగాహన లేదని వ్యాఖ్యానించారు.

Revanth Reddy Fires On CM KCR
Revanth Reddy Fires On CM KCR

Revanth Reddy Fires On CM KCR: కథలాపూర్ మండలంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి పేజ్ 2 స్టేజ్ 1ను 2005లో 1,750 కోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారని... ఇంతమంచి ప్రాజెక్ట్​ను తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్​ను రేవంత్​ అభినందించారు. 2018లో బీఆర్ఎస్ ఓడిపోతుందని హరీశ్​రావు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని ఆరోపించారు.

నాలుగేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు: సాగు, తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మభ్యపెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు, రాస్తారోకోలు చేసిందని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. రైతులు ప్రశ్నిస్తే ఇప్పుడు.. వరదకాలువ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారన్నారు.

Revanth Reddy Latest Comments: ఎతైన ఈ ప్రాంతానికి వరదకాలువ ద్వారా నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అపర భగీరథుడు, ఇంజినీర్ కేసీఆర్​కు ఆ మాత్రం తెలియదా..? సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని కేసీఆర్ పదే పదే ప్రశ్నించారన్నారు. ఉమ్మడి పాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే.. తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్​రెడ్డికి, కేసీఆర్​కు పెద్ద తేడా ఏం లేదని, ఈ వివక్షను ఈ ప్రాంత రైతులకు భరించే ఓపిక లేదని తెలిపారు.

ఆయనను మారిస్తే తప్ప రైతుల జీవితాల్లో మార్పు రాదు: కేసీఆర్​ను మారిస్తే తప్ప రైతుల జీవితాల్లో మార్పు రాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు మేం మొదలు పెట్టిన ప్రాజెక్టును.. రేపు మేమే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంత సమస్యలపై ఇక్కడి ఎమ్మెల్యేకు అవగాహన లేదని విమర్శలు చేశారు.

విహార యాత్రలకు వచ్చినట్లుగా ఎమ్మెల్యే జర్మనీ నుంచి వచ్చి పోతున్నారని తెలిపారు. కోర్టులను అడ్డుపెట్టుకుని సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నరని వివరించారు. కానీ మానసికంగా ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుర్తించడం లేదన్న రేవంత్.. వారసత్వం ముసుగులో రాజకీయాల్లో కొనసాగుతున్నారని వెల్లడించారు. రాజేశ్వర్​రావు పేరును చెడగొడుతున్నారని చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details