తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ రమణతో జగిత్యాల కౌన్సిలర్ల భేటీ.. ఆ అంశంపై కీలక చర్చ..!

By

Published : Jan 27, 2023, 1:57 PM IST

అధికార పార్టీకి చెందిన జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భోగ శ్రావణి రాజీనామాతో ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో స్థానిక కౌన్సిలర్లు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఆమె పదవికి రాజీనామ చేసినప్పటికీ పార్టీ ధిక్కారణ చర్యలకు పాల్పడిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్సీ రమణతో జగిత్యాల కౌన్సిలర్ల భేటీ.. ఆ అంశంపై కీలక చర్చ..!
ఎమ్మెల్సీ రమణతో జగిత్యాల కౌన్సిలర్ల భేటీ.. ఆ అంశంపై కీలక చర్చ..!

అధికార పార్టీకి చెందిన జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భోగ శ్రావణి రాజీనామా నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో స్థానిక కౌన్సిలర్లు సమావేశమయ్యారు. జగిత్యాలలోని ఆయన నివాసంలో రమణతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. భోగ శ్రావణి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. పార్టీ ధిక్కరణ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రావణితో చర్చలు లేకుండా మరో ఛైర్‌పర్సన్​ను ఎన్నుకోవాలని కౌన్సిలర్లు రమణ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో భవిష్యత్‌ కార్యాచరణపై ఏం చేయాలనే విషయంపై కౌన్సిలర్లతో రమణ మాట్లాడారు. అయితే ఏ విషయమై అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు.

కన్నీటి పర్యంతమైన మున్సిపల్​ ఛైర్​పర్సన్..: జగిత్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా మున్సిపల్​ ఛైర్​పర్సన్​ భోగ శ్రావణి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ మధ్య నలుగుతున్న వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ పదవికి శ్రావణి రాజీనామా చేసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులతోనే తాను రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.

ఎమ్మెల్యే సంజయ్‌ మూర్ఖత్వాన్ని మూడేళ్ల పాటు భరించానని వాపోయిన ఆమె.. అందరి ముందు ఎమ్మెల్యే అవమానించేవారని ఆరోపించారు. పేరుకే మున్సిపల్ ఛైర్మన్‌.. పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని ఆమె విచారం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎమ్మెల్యే ఇవ్వలేదని.. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని.. కేటీఆర్ పేరు ఎత్తకూడదనే ఆంక్షలు జారీ చేసేవారని వాపోయారు. కలెక్టర్‌ను కలవవద్దని కూడా హుకూం జారీ చేసేవారని తెలిపారు. ఒక బీసీ బిడ్డగా తన ఎదుగదల చూడలేక సంజయ్​కుమార్​ తనపై కక్షగట్టారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

సంజయ్​ కుమార్​తో నా కుటుంబానికి ఆపద పొంచి ఉంది: అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని భోగ శ్రావణి తెలిపారు. తనతో పాటుగా మున్సిపల్‌ కమిషనర్‌ను కూడా సస్పెండ్‌ చేస్తానని ఎమ్మెల్యే బెదిరించారని ఆమె ఆరోపించారు. దీంతో కమిషనర్‌ సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్​కుమార్​తో తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని జిల్లా ఎస్పీ తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా.. గత నాలుగు రోజుల క్రితం 27 మంది మున్సిపల్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై తిరుగుబావుటా ఎగుర వేసిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి..

రాష్ట్రంలో మహిళలతో కంటతడి పెట్టించడం సరికాదు: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

'అమ్మను చూస్తే సమయపాలన ఎలా చేయాలో తెలుస్తుంది'.. పరీక్ష పే చర్చలో విద్యార్థులతో మోదీ

ABOUT THE AUTHOR

...view details