తెలంగాణ

telangana

మాస్టర్​ ప్లాన్​ వివాదం.. పంచాయతీ భవనం ఎక్కిన అంబారిపేట రైతులు

By

Published : Jan 17, 2023, 3:46 PM IST

Updated : Jan 17, 2023, 4:55 PM IST

Farmers protest in Ambaripet

Farmers protest against master plan: జగిత్యాల మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. బృహత్‌ ప్రణాళికను రద్దు చేయాలంటూ.. వ్యవసాయ యోగ్యమైన భూములు ఇవ్వమంటూ.. రైతులు నిరసనలు ఉద్ధృతం చేస్తున్నారు. ఇవాళ అంబారిపేటలో అన్నదాతలు పంచాయతీ భవనంపై ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్​ ఆఫీస్​ వరకూ ర్యాలీగా వెళ్లారు.

Farmers protest against master plan: జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాల ప్రభావిత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న జగిత్యాల-నిజామాబాద్‌ రహదారిలో హుస్నాబాద్‌ వద్ద అంబారిపేట, హుస్నాబాద్‌ రైతులు ఆందోళన చేపట్టగా.. మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఇవాళ అంబారిపేట రైతులు గ్రామ పంచాయతీ భవనంపై ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా కలెక్టర్​ ఆఫీస్​ వరకూ వెళ్లారు.

మిగతా గ్రామాల్లో కూడా రైతన్నలు మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు ఇప్పటికే వారి పదవులకు రాజీనామా చేయగా.. ఈ ముసాయిదాను రద్దు చేసేవరకూ ఎంతవరకైనా పోరాడతమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి అన్నదాతలతో తగు చర్చలు జరిపి పరిస్థితి చేయిదాటకుండా చూడాలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం తమ పంథా మార్చుకోకుంటే కామారెడ్డి తరహాలో ఆందోళనలు ఉద్దృతం చేస్తామని రైతులు తెలిపారు.

ఏంటి ఈ మాస్టర్​ ప్లాన్​ వివాదం: 2041 వరకు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళికకు ముసాయిదా విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే రోడ్ల విస్తరణ, పారిశ్రామిక, వాణిజ్య, పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌, పార్క్‌, ప్లేగ్రౌండ్స్‌ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084 హెక్టార్లుగా ప్రతిపాదించారు. 823 హెక్టార్లు పట్టణ ప్రాంతాన్ని, 216 హెక్టార్లు రహదారుల విస్తరణ, 209 హెక్టార్లు కొత్త రోడ్ల నిర్మాణం, 324 హెక్టార్లు ఉద్యాన, వినోద పార్కులు, 309 హెక్టార్లు వాణిజ్య జోన్‌, 2423 హెక్టార్లు నివాసిత ప్రాంతం, 238 హెక్టార్లు అటవీ ప్రాంతం, 546 హెక్టార్లు చెరువులు, 372 హెక్టార్లను గుట్టలుగా ప్రతిపాదించారు.

ఏ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు: మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాలో సమీప గ్రామాలను చేర్చడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నర్సింగాపూర్‌, కండ్లపల్లి, తిమ్మాపూర్‌, తిప్పన్నపేట, హస్నాబాద్‌, లింగంపేట, మోతె వాసులు తమ భూములపై హక్కులు కోల్పోతామని వాపోతున్నారు. కనీస అవగాహన కల్పించకుండానే పంచాయతీల తీర్మానాలను బలవంతంగా తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

"ఈరోజు అంబారిపేట, హస్నాబాద్​ మరో రెండు గ్రామాలోని రైతుల అనుమతి లేకుండా మాస్టర్​ప్లాన్​ రూపోందించారు. అందుకే మేము ఈరోజు రోడ్డు ఎక్కాం. ప్రభుత్వం వేంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మాణం చేశాం. మాస్టర్​ ప్లాన్​లో చాలా మంది రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు."- మహిళ రైతు, అంబారిపేట

"ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉద్రిక్తం చేస్తాం. మా భూములు కాపాడుకునేందుకు మేము ఎంత వరకైనా వెళ్తాం. ఇప్పటికే మా భూములు మొదటి, రెండు బైపాస్​ రోడ్లకు పోయింది. రైల్వే ట్రాక్​కు కొంత పోయింది. కెనాల్​కు కొంత పోయింది. ఉన్న ఒకటో రెండో ఎకరాలు వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు అదికూడా లాక్కొవాలని చూస్తున్నారు. ఇది చాలా దారుణమైన చర్య".- రైతు, అంబారి పేట

మాస్టర్​ ప్లాన్​ వివాదం.. పంచాయతీ భవనం ఎక్కిన అంబారిపేట రైతులు

ఇవీ చదవండి:

Last Updated :Jan 17, 2023, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details