తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో తెరాస శ్రేణుల సంబురాలు

By

Published : Mar 21, 2021, 5:19 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెరాసను ఆశీర్వదించినందుకు పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో తెరాస శ్రేణుల సంబరాలు
ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో తెరాస శ్రేణుల సంబరాలు

సాధారణ ఎన్నికల్ని తలిపించేలా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో రెండు స్థానాలను పార్టీ కైవసం చేసుకోవటంతో తెరాస సంబురాలు ఆకాశన్నంటాయి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శుభాకాక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారనే విషయం మరోసారి రుజువైందని ట్వీట్‌ చేశారు.

అభివృద్ధికే పట్టభద్రులు పట్టం కట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. గెలుపుకోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో తెరాస శ్రేణులు విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. మహిళలు నృత్యాలతో సందడి చేశారు.

జిల్లాల్లో...

హన్మకొండలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంబురాల్లో పాల్గొన్నారు. ఎన్నికేదైనా విజయం తెరాసదేనంటూ వ్యాఖ్యానించారు. సురభి వాణీదేవికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలిలో తన గళం వినిపించాలని సూచించారు. బేగం బజార్‌లో ఆదిత్య కృష్ణ ఛారిటబుల్‌ ట్రస్ట్ ఛైర్మన్‌ నంద కిషోర్ వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో... టపాసులు కాల్చారు. చైతన్యపురి బస్టాప్ వద్ద వాహనదారులకు మిఠాయిలు పంచారు.

తెరాస అభ్యర్థుల విజయం పట్ల సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. లక్షా 50 వేల మంది ఉద్యోగులు తెరాసను బలపరిచారని... ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరింది. నిజామబాద్‌, కామారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో తెరాస శ్రేణులు అంబరాలు ఆకాశన్నంటాయి.

ఇదీ చూడండి:హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్​ స్థానంలో వాణీదేవికి పట్టం

ABOUT THE AUTHOR

...view details