ప్రజల ప్రతినిధిగా ఉండే కలెక్టర్.. ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సిద్దిపేట జిల్లా పాలనాధికారి.. సీఎం కాళ్లపై ఎలా మోకరిల్లుతారని ఆయన నిలదీశారు. ఆచార్య జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జయశంకర్.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓ మార్గదర్శకుడిలా ఉద్యమకారులను ముందుండి నడిపించారంటూ కొనియాడారు.
పాలనాధికారులు.. జిల్లా ప్రతినిధులుగా ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. కలెక్టర్లు.. కలెక్టర్ల మాదిరిగానే వ్యవహరించాలి. దుష్ట సంప్రదాయలను పెంపొందించకూడదు. సీఎం కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏముంది. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించం. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. రాజకీయాల్లో ఇలాంటి వాటిని రూపు మాపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది.