Telangana Leaders Reaction on Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వేడి రాజేసింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ పోరాటం ఫలించిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లుపై ఇప్పటికైనా ఓ ముందడుగు పడిందని ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కవిత.. తదితర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లను కూడా బిల్లులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు చట్టం రూపు దాల్చితే మరింత మంది మహిళలకు లాభదాయకంగా ఉంటుందని పలువురు నాయకులు తెలిపారు.
BJP Leaders Reaction on Womens Reservation Bill in Telangana : మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womens Reservation Bill) నూతన పార్లమెంటు భవనంలో.. కీలక ముందడుగుగా అభివర్ణించిన బీజేపీ అన్ని పార్టీలు ఇందుకు మద్దతు పలకాలని కోరింది. మహిళలకు బీజేపీ పెద్దపీట వేస్తోందని ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత రిజర్వేషన్ల బిల్లును తమ ఘనతగా చెప్పుపోవడం విడ్డూరమని విమర్శించారు. ముందుగా బీఆర్ఎస్లో మహిళలకు సరైన ప్రాధాన్యం ఇచ్చి అప్పుడు మాట్లాడాలన్నారు.
"మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం వెనుక కేసీఆర్, కవిత వారి కృషే ఉందని చెప్పుకోడం విచారకరం. కవితను తప్ప ఇతర మహిళలను గౌరవించే అలవాటు కేసీఆర్కి లేదు. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయింపులో కనీసం మహిళలకు 15 శాతం కూడా ప్రకటించలేదు. బీఆర్ఎస్ కమిటీల్లో.. పార్టీలోనూ మహిళలకు కీలకమైన స్థానం ఉందా ?. " - డీకేఅరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు