తెలంగాణ

telangana

Telangana Cabinet Meeting Today : నేడు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

By

Published : May 18, 2023, 7:13 AM IST

Updated : May 18, 2023, 7:33 AM IST

CM KCR
CM KCR

Telangana Cabinet Meeting Today : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ.. వచ్చే ఎన్నికలకు సమాయత్తమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం సహా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై.. మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై కూడా నేడు కేబినెట్‌లో చర్చ జరగనుంది.

నేడు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

Telangana Cabinet Meeting Today : తెలంగాణ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. జూన్ 2 నుంచి 21 రోజులపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రాభివృద్ధి తీరుతెన్నులను ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించాలని.. కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇదే మంచి తరుణం : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉత్సవాల కార్యాచరణ ప్రణాళికను కూడా.. మంత్రులు, అధికారులతో చర్చించి ఖరారు చేయనున్నారు. సచివాలయం ఎదుట సిద్ధమైన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభ తేదీని ఖరారుచేసే సూచనలు ఉన్నాయి.

పోడు పట్టాలను ఇప్పటికే సిద్ధం చేయగా.. పంపిణీ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి.. అమలు కార్యాచరణ ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఈక్రమంలోనే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు. మెదక్ జిల్లా కొల్చారంలో ప్రముఖ భాషాకవి మల్లినాథ సూరి పేరిట సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

కల్తీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. మంజీరా కార్పొరేషన్ ద్వారా మరో రూ.3,300 కోట్ల రుణాల ద్వారా సేకరణకు.. కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. టీఎస్​పీఎస్సీలో ఇటీవల అనుమతించిన పరీక్షల కంట్రోలర్ సహా పది పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఎత్తిపోతల పథకానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం : గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారుఖ్ హుస్సేన్ పదవీకాలం ఈ నెల 27తో ముగియనుండగా.. రెండు స్థానాలకు ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ ఆమోదించి గవర్నర్‌కు సిఫారసు చేసే అవకాశం ఉంది. పెండింగ్​లో ఉన్న బిల్లులు, వాటి విషయంలో తదుపరి కార్యాచరణ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అందుకు సన్నాహక ప్రణాళికపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, సమర్థంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి..లబ్ది చేకూర్చడం లాంటి వాటిపై మంత్రులకు సీఎం మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికల కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:BRS Meeting In Telangana : రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలి: కేసీఆర్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే.. డిప్యూటీ సీఎంగా డీకే.. మే 20న ప్రమాణం!

Last Updated :May 18, 2023, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details