BRS Meeting In Telangana : రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలి: కేసీఆర్
Published: May 17, 2023, 10:07 PM

BRS Meeting At Telangana Bhavan : రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయన్న ఆయన.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఘనంగా వేడుకలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమావేశం అనంతరం బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ప్రభుత్వం, పార్టీ తరపున ఈ వేడుకలు అంబరాన్ని అంటేలా నిర్వహిస్తామని తెలిపారు. వందకు పైగా సీట్లలో గులాబీ అభ్యర్థులు గెలవటం ఖాయమని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు.