తెలంగాణ

telangana

ప్రధాని పర్యటనకు భాజపా నేతల భారీ ఏర్పాట్లు.. బేగంపేటలో భారీ స్వాగతసభ

By

Published : Nov 11, 2022, 6:56 AM IST

Updated : Nov 11, 2022, 7:26 AM IST

PM Modi Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాష్ట్ర పర్యటన దృష్ట్యా భాజపా స్వాగత సభకు ఏర్పాట్లు చేస్తోంది. వేలాది మందితో ఈ సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భాజపా ముఖ్య నేతలతోనూ ప్రధాని భేటీ కానున్నారు. స్థానిక రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయి. అనంతరం రామగుండం పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. మునుగోడులో ఓటమితో నైరాశ్యంలో ఉన్న కమలం శ్రేణులకు మోదీ సభ కొత్త ఉత్సాహం నింపనుంది. ప్రధాని పర్యటనపై అధికార, విపక్షాల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సీఎస్ సోమేశ్‌ కుమార్ ఆదేశాలిచ్చారు.

Prime Minister modi Telangana tour
Prime Minister modi Telangana tour

ప్రధాని పర్యటనకు భాజపా నేతల భారీ ఏర్పాట్లు.. బేగంపేటలో భారీ స్వాగతసభ

PM Modi Tour: రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలకాలని కమలదళం నిర్ణయించింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా జాతీయ నేత లక్ష్మణ్‌ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. బేగంపేట విమానాశ్రయం ప్రాంగణంలోనే ప్రధాని సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదిక నుంచి కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు .

సభకు భారీ జనసమీకరణలో నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని పర్యటన, బేగంపేటలో స్వాగత సభ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సభ అనంతరం హెలికాప్టర్‌లో రామగుండం చేరుకుంటారు. అక్కడ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా పలువురు నేతలు మోదీకి స్వాగతం పలకనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు

సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల కార్మాగారం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని పర్యటనపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, రామగుండంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం: పెద్దపల్లి కలెక్టర్, రామగుండం సీపీ, రామగుండం ఫర్టిలైజర్స్ సీఈఓతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రామగుండంలో ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. భాజపాయేతర రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపడతామన్నారు.

మోదీకి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ: రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేస్తూ మాట్లాడిన ప్రధాని ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రానికి రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాగా వ్యవహరించి.. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం చేపడుతున్న కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావాలని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు: రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా రాష్ట్ర రైతులకు ఎంతో లబ్ధి చేకూరనుందని కిషన్​రెడ్డి తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దని సీఎం కేసీఆర్​కు కిషన్​రెడ్డి సూచించారు. రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయాలకతీతంగా అందరూ స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని భాజపా రాజసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. కమ్యూనిస్టులు , ప్రజాసంఘాల నేతలు మోదీ పర్యటనను అడ్డుకుంటామనటం సరికాదన్నారు. అభివృద్దిని అడ్డుకునే వారిని తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:కేసీఆర్ హుందాగా వ్యవహరించి 'రామగుండం' ప్రారంభోత్సవంలో పాల్గొనాలి: కిషన్‌రెడ్డి

రెండేళ్ల తర్వాత కనిపించిన తెల్ల ఎలుగుబంటి వీడియో వైరల్

Last Updated :Nov 11, 2022, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details