KTR on Nizam College Students Issue: హైదరాబాద్ నిజాం కళాశాల విద్యార్థినుల ఆందోళనలపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సమస్య పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. గత కొన్నిరోజులుగా నిజాం కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. ఇటీవల తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కళాశాలలో కొత్తగా నిర్మించిన మహిళా హాస్టల్ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. వసతి గృహం కేటాయింపుపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. సమస్య పరిష్కరించేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. సమస్యకు ముగింపు పలకాలని నిజాం కళాశాల ప్రిన్సిపల్కు కేటీఆర్ సూచించారు.
అసలేం జరిగింది: నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థినులు ప్రిన్సిపల్తో వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
అయిదు రోజులు సమయం ఇవ్వాలని చెప్పిన ప్రిన్సిపల్.. దొంగచాటుగా పీజీ విద్యార్థినులకు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రిన్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు హాస్టల్ వసతి కేటాయించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: