తెలంగాణ

telangana

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజుల్లో బుక్​ ఫెయిర్​

By

Published : Dec 20, 2022, 3:42 PM IST

35th National Book Fair in Hyderabad: చిరిగిన చొక్కా అయిన తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం అన్నారు. ఓ మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. మనం పుట్టినప్పటి నుంచి పుస్తకాలు పట్టుకొనే పెరుగుతాం. ప్రతి పుస్తకము ఒక అద్భుత జ్ఞాన బండాగారమే. అలాంటి పుస్తకం కొనడం అంటే జ్ఞానాన్ని సంపాదించడమే. మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో పుస్తక జాతర మొదలుకాబోతోంది.

35th National Book Fair in Hyderabad
35th National Book Fair in Hyderabad

KTR to Inaugurate Hyderabad Book Exhibition: పుస్తక ప్రియులకు అత్యంత ఇష్టమైన జాతీయ పుస్తక మహోత్సవం హైదరాబాద్‌లో మళ్లీ రాబోతుంది. 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరనుంది. ఇందులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 1వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

ఏటా పుస్తక మహోత్సవానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి పబ్లిషర్స్‌తో పాటు పుస్తక ప్రియులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ పుస్తక ప్రదర్శనను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక ప్రాముఖ్యత తగ్గలేదని, పుస్తకం ఒక తల్లి పాత్ర పోషిస్తుందని సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.

ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టారు. వేదికకు కవి అలిశెట్టి ప్రభాకర్ పేరు ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, ప్రముఖుల జీవిత చరిత్ర సహా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమంత్రి స్టాల్‌లో, కేసీఆర్​పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ సహా ఇతర భారతీయ భాషల సాహిత్యంతోపాటు నవలలు, కథలు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం స్టడీ మెటీరియల్స్, వివిధ పబ్లికేషన్స్‌కు సంబంధించిన పుస్తకాలు ప్రదర్శనలో లభించునున్నాయి. పుస్తక ప్రదర్శనలో రచయితల హాల్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఇందులో రచయితలు తాము రాసిన పుస్తకాలను వారే స్వయంగా అమ్ముకోవడం, పాఠకులతో ప్రత్యక్షంగా మాట్లాడుకోవటం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత జ్ఞాన తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం తెలంగాణ కళాభారతి మైదానాన్ని ఉచితంగా ఇస్తున్నారని గౌరీశంకర్‌ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. శని, ఆదివారాలు.. ఇతర సెలవు రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

అక్షరాల్ని కొన్ని వేల పుస్తకాలుగా, కొన్ని లక్షల పుస్తకాలుగా, ఒకచోట కుప్పగా పోస్తే ఎట్లా ఉంటుందో చూడడం అందరికి ఇష్టమే. అన్ని పక్షాలకు చెందినటువంటి వారు ప్రజా సంఘాల వాళ్లు అందరు కూడా మంచిగా పార్టిసిపెట్ కావడం వలన మాత్రమే. ఈ పుస్తక ప్రదర్శన లక్ష్యలాది మంది గెదర్ అవుతున్నటువంటి అతి పెద్ద ఈవెంట్​గా హైదరాబాద్​లో నిలబడిందంటే దానికి కారణం అన్ని వర్గాల ప్రజల అందరి మద్ధతు వల్ల మాత్రమే అది జరిగింది. -జూలూరు గౌరీ శంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details