తెలంగాణ

telangana

పోలవరం విచారణ నుంచి వైదొలిగిన ఏపీ హైకోర్టు సీజే

By

Published : Feb 1, 2023, 2:24 PM IST

Polavaram Project: ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టు వ్యయం పూర్తిగా కేంద్రమే భరించాలని గతంలో హైకోర్టులో పిల్​ దాఖలైంది. అయితే తాజాగా ఇది విచారణకు రాగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణ నుంచి వైదొలిగారు. తాను ఈ విచారణను చేపట్టటం భావ్యం కాదని పేర్కొన్నారు. ఇంతకీ ఏమైందంటే..?

Chief Justice of AP High Court
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Polavaram Project: ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున, వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలని.. కోరుతూ కాంగ్రెస్‌ మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో 2017లో పిల్​ దాఖలు చేశారు. దీని విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర తెలిపారు. తాను అడ్వకేట్‌ జనరల్​గా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి పోలవరంపై న్యాయ సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను విచారించటం భావ్యం కాదని తెలిపారు. వ్యాజ్యాన్ని మరో ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

2013-14వ సంవత్సరం నాటి అంచనా ధరల ప్రకారం మాత్రమే పోలవరం ప్రాజెక్ట్‌కు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిని రాజ్యాగం, రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ప్రకటించి, వ్యయం మొత్తం కేంద్రప్రభుత్వం భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీ గతంలో హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనల వినాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అనుబంధ పిటిషన్‌ వేశారు.

  • ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారని, వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉందని పేర్కొన్నారు. హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ముందుకు పిల్‌ విచారణకు వచ్చింది. విచారణకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హాజరు అయ్యారు. సీజే స్పందిస్తూ ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details