తెలంగాణ

telangana

Heavy Rain in Hyderabad : అర్ధరాత్రి వచ్చింది.. ఆగం చేసింది..!

By

Published : Jul 26, 2022, 10:54 AM IST

Heavy Rain in Hyderabad

Heavy Rain in Hyderabad : హైదరాబాద్​లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. ఇప్పటికే చెరువులన్నీ దాదాపుగా నిండిపోవటం.. ఊహించని రీతిలో మళ్లీ వర్షం రావటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. కాలనీలు, అపార్ట్​మెంట్లు జలమయం కావటంతో.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.

Heavy Rain in Hyderabad : హైదరాబాద్​ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఊహించని విధంగా కురిసిన వాన.. ప్రజలను అతలాకుతలం చేసింది. పాతబస్తీ, నారాయణగూడ, ఖైరతాబాద్, చంపాపేట్, దిల్​సుఖ్​నగర్​, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వానలకు మూసీ ఉప్పొంగుతోంది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్​పేట వంతెన కింద భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. రోడ్లపై నిలిచిన వరద నీటితో వాహనదారులు అవస్థలకు గురయ్యారు.

నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పటేల్​నగర్​లోని సాయికృప అపార్ట్​మెంట్​ చెరువును తలపిస్తోంది. పలు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సరూర్​నగర్​, కోదండరాం నగర్​తో పాటు పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. సూరారం తెలుగుతల్లి నగర్​లో మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ అధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

రాత్రి కురిసిన వర్షానికి గాజులరామారంలోని వొక్షిత్​ ఎంక్లేవ్​ను వరద మరోసారి ముంచెత్తింది. చిన్నపాటి వర్షానికే ఎగువన ఉన్న పెద్ద చెరువు నిండి.. వరద నీరు కింద ఉన్న కాలనీల్లోకి చేరుతోంది. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోకాళ్ల లోతు నిల్వ ఉన్న నీటితో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.

నేలకొరిగిన చెట్లు..: హయత్​నగర్ డివిజన్ పరిధిలోని బి.డి.ఎల్​.కాలనీ జలమయమైంది. పలు చెట్లు నేలకొరిగాయి. హయత్​నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, ఏఈతో కలిసి కాలనీలను సందర్శించారు. డీఆర్​ఎఫ్​ బృందాన్ని పిలిపించి.. సహాయక చర్యలు ప్రారంభించారు. పెద్ద అంబర్​పేట్​ మున్సిపాలిటీ పరిధిలోని కళానగర్​లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.

ఇటీవల ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు నగరంలో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. అర్ధరాత్రి వేళ మరోసారి భారీగా కురిసిన వానలకు చెరువుల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో నగరంలోని చెరువుల పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాల కాలనీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details