తెలంగాణ

telangana

ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు

By

Published : Sep 24, 2022, 7:16 AM IST

Dharani issues

Government Instructions on Dharani Problems: ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. న్యాయస్థానాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి రాకూడదని రెవెన్యూశాఖకు ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టం చేశారు. టీఎం 33 మాడ్యుల్ సహా నిషేధిత జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని.. ఉమ్మడిగా ఉన్న వాటిపై తక్షణమే దృష్టి సారించాలని ఉన్నతాధికారులు తెలిపారు.

ధరణి సమస్యలు వేగవంతం చేయాలి.. కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ

Government Instructions on Dharani Problems: భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ అమలు, తదనంతర పరిణామాల్లో ఉత్పన్నమైన సమస్యలు యజమానులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తప్పిదాలు, పొరపాట్లు, బదలాయింపు ప్రక్రియ సందర్భంగా ఏర్పడిన సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నీ సవ్యంగా ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు సాఫీగా సాగిపోతుండగా సమస్యల్లో పడిన వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది.

ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారింది. పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావనతో పాటు పరిష్కారం దిశగా కసరత్తు జరిగింది. అందులో భాగంగా పోర్టల్‌లో కొన్ని ఐచ్చికాలు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ సమస్యలు ఇంకా మిగిలిపోయాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఉన్నతాధికారులపై ప్రభుత్వంలోని ముఖ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పంతాలు, పట్టింపులకు పోవాల్సిన అవసరం లేదని సమస్య ఎక్కడ ఉందో సానుకూలంగా ఆలోచించి కలెక్టర్లు, కింది స్థాయి అధికారులకు మార్గనిర్ధేశం చేయాలని సూచించారు.

ధరణి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: భూయాజమాన్య సంబంధిత సమస్యల పరిష్కారం కోసం పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం సరికాదని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. లెక్కలు, గణాంకాలు కాకుండా పరిస్థితులను చక్కబెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ధరణి సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. టీఎం 33 మాడ్యూల్ కింద వచ్చిన దరఖాస్తులతో పాటు పొరపాటుగా నిషేధిత జాబితాలో చేరిన భూముల సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కలెక్టర్లకు స్పష్టం చేశారు.

ఆయా జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఒకే రకమైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తద్వారా ఎక్కువ మంది సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కార స్థితి, సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details