'కాంగ్రెస్​లోకి కోడలు లాగా వచ్చాను... ఇక్కడ ఈ పార్టీ గౌరవం నిలబెడతా'

author img

By

Published : Sep 23, 2022, 9:51 PM IST

Updated : Sep 23, 2022, 10:27 PM IST

Revanth Reddy

Revanth Reddy Munugodu campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోకి కోడలిలా వచ్చానన్న రేవంత్‌ రెడ్డి...ఈ పార్టీ కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. తాను జైలులో తిన్నచిప్పకూడు సాక్షిగా...రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని మునుగోడు ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు.

Revanth Reddy Munugodu campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా సంస్థాన్ నారాయణ పురం మండలం గుడిమల్కాపూర్, కోతులపురం, అల్లందేవి చెరువు, సర్వేల్ గ్రామాల్లో ప్రచారం చేశారు. ఒకప్పుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌లో ఉన్నాడని ఆయన తెదేపాలోకి కోడలి లాగా వచ్చాడని... తాను తెదేపా బిడ్డనని... అక్కడ నుంచి కాంగ్రెస్‌లోకి కోడలి లాగా వచ్చానని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నాడు. పుట్టిల్లు అయిన తెలుగు దేశం నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడునే తనను కాంగ్రెస్‌లోకి పంపించాడని అర్థం వచ్చేట్లు వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. కాంగ్రెస్ పార్టీలోకి కోడలు లాగా వచ్చిన తాను...ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ గౌరవం నిలబెడతానని స్పష్టం చేశారు.

పేదల కోసం వందసార్లు జైలుకెళతా: తాను జైలులో తిన్నచిప్పకూడు సాక్షిగా...తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పేదల కోసం ఒక్కసారి కాదు వంద సార్లు జైలుకు వెళ్లడానికి సిద్దమని ప్రకటించారు. కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని గోతికాడి నక్కల్లా బీజేపీ, తెరాసలు ఎదురు చూశాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

దేశంలో కాంగ్రెస్‌పై బీజేపీ కుట్రలు చేస్తోంది. తనను అడ్డు తొలగించుకోడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడు. నేను దొంగతనం చేసి జైలుకు పోలేదు. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లా.. మునుగోడుతో తమకు ఎంతో అనుబంధం ఉంది. కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్... ఎన్నికల కోసం వాళ్ల కాళ్లు పట్టుకున్నాడు. - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచినందుకు....? చంటిపిల్లల పాలపై జీఎస్టీ వేసినందుకు బీజేపీ వాళ్లకు ఓటేయాలా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు, గిరిజనులకు భూములు పంచినందుకు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన తమకే మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు. పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్ననమ్మకము తనకుందన్నారు. ఒకప్పుడు తాను టీడీపీ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తినని కాంగ్రెస్ గౌరవాన్ని నిలబెడతా..మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేస్తానని పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

ఇవీ చదవండి:

Last Updated :Sep 23, 2022, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.