టికెట్ల అమ్మకాల్లో హెచ్‌సీఏ ఫెయిల్.. చేతులెత్తేసిన అజారుద్దీన్

author img

By

Published : Sep 23, 2022, 7:59 PM IST

Azharuddin said that HCA has nothing to do with the sale of tickets

Azharuddin on ind aus match tickets ఉప్పల్ మైదానం వేదికగా ఈనెల 25న జరిగే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం కొనసాగుతోంది. సజావుగా టికెట్లు జారీచేయడంలో హెచ్‌సీఏ ఘోర వైఫల్యం విమర్శలకు తావిస్తోంది. టికెట్ల పంపిణి పేటీఎంకు కేటాయించామన్న హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం పెద్దలు... తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు . బ్లాక్‌లో టికెట్లు అమ్మలేదని అధ్యక్షుడు అజారుద్దీన్‌ బుకాయించగా...కార్యదర్శి విజయానంద్‌ మాత్రం ఆలా తేలితే చర్యలు తీసుకుంటామనడం కొసమెరుపు.

టికెట్ల అమ్మకాల్లో హెచ్‌సీఏ ఫెయిల్.. చేతులెత్తేసిన అజారుద్దీన్

Azharuddin on ind aus match tickets మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌కు దక్కిన అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణలో హెచ్‌సీఏ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది. టికెట్ల జారీ నుంచే గందరగోళానికి తెరలేపిన అసోసియేషన్‌ పెద్దలు... అభిమానులను అసహనానికి గురిచేస్తున్నారు . అభిమాన క్రికెటర్ల ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షిద్దామన్న సగటు ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతున్నా అంతా సవ్యంగానే ఉందంటూ సముదాయిస్తున్నారు . టికెట్ల పంపిణి అవతకతవకలను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. టికెట్ల అమ్మకంలో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. బ్లాక్‌లో విక్రయించలేదని చెబుతూనే... అలాంటివి జరిగితే చర్యలు తప్పవంటూ చెప్పుకొచ్చారు.

టికెట్ల అమ్మకాలకు సంబంధించి హెచ్సీఏకు సంబంధం లేదు. టికెట్ల అమ్మకాలు పేటీయంకు అప్పగించాం. టికెట్ల అమ్మకాల విషయంలో పేటియం అద్భుతంగా పని చేసింది. టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపాం... బ్లాక్‌లో అమ్మలేదు. బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్లు విచారణ తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము స్టేడియంలో ఏర్పాట్ల నిర్వహణలో బిజీగా ఉన్నాం. - అజారుద్దీన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు

హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ మాత్రం మ్యాచ్ విజయవంతం కోసం కృషి చేస్తున్నామని వివరించారు. పూర్తి అధికారాలు తమకు లేవన్న విజయానంద్‌... అసోసియేషన్‌లో విబేధాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. చిన్న,చిన్న తప్పిదాలు జరిగాయని అంగీకరించిన ఆయన...తొక్కిసలాటలో గాయపడ్డవారికి హెచ్‌సీఏ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అంతకుముందు టికెట్ల కోసం క్రీడాభిమానులకు తిప్పలు తప్పలేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి జింఖానాలో మైదానంలో టిక్కెట్లు ఇస్తామని తొలుత ప్రకటించారు. టిక్కెట్లు తీసుకునేందుకు వచ్చినవారిని మళ్లీ అయోమయానికి గురి చేశారు. ఎలాంటి టిక్కెట్లు ఇవ్వడంలేదంటూ హెచ్‌సీఏ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీని చూపి క్రికెట్ అభిమానులను పోలీసులు పంపించివేశారు.

చాలామంది క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌లో అమ్మారని చెబుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఒకవేళ ఎవరైనా టికెట్లను బ్లాక్‌లో అమ్మితే పోలీసులతో కలిసి అసోసియేషన్‌ తరఫున వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని అతిక్రమించిన వారిపై నిబంధనల ప్రకారం పోలీసులు విధులు నిర్వహిస్తారు. మా వైపు నుంచి చాలా స్పష్టంగా ఉన్నాం. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మినపుడు బ్లాక్‌లో ఎలా దొరుకుతాయో ఆలోచించాలి. ఎవరైనా బ్లాక్‌లో అమ్మినట్లు చెబితే అది పూర్తిగా అబద్దం. అజారుద్దీన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు

ఆ తర్వాత కొద్దిసమయానికి పేటీఎం నిర్వాహకులు.... జింఖానా మైదానానికి చేరుకుని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి క్యూఆర్‌ కోడ్‌ పరిశీలించి టికెట్లు అందించారు. తొలుత టిక్కెట్లి ఇస్తామని... ఆ తర్వాత ఇవ్వమని గందగోళానికి గురి చేశారని క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తంచేశారు. మ్యాచ్‌ టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మానవహక్కుల కమిషన్‌లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.