తెలంగాణ

telangana

సీమ రైతుల ఉసురు తీసిన మాండౌస్ తుపాను

By

Published : Dec 12, 2022, 7:11 AM IST

Heavy damage to farmers in Rayalaseema: మాండౌస్ తుపాన్..! మట్టిని నమ్ముకుని అహర్నిశలు శ్రమించే అన్నదాతల కష్టాన్ని నీటిపాలు చేస్తూ.. కన్నీటిని మిగిల్చింది. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వానలకు ఏపీలోని రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అప్పులు చేసి మరీ పంటలు వేస్తే..వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Tpt Seema loss nl
Tpt Seema loss nl

Cyclone immense damage in Rayalaseema: మాండౌస్ తుపాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వానలకు నెల్లూరు నగర శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రామిక నగర్, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, చంద్రబాబు నగర్, మల్లయ్యగుంట ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పెద్దూరు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. కోవూరు మండలం వేగురు కాలువలో పడి ఓ మహిళ గల్లంతైంది...

చెరువులా మారిన పొలాలు: నెల్లూరు జిల్లాలో నెలన్నర కిందటే వేలాది ఎకరాల్లో రైతులు రబీ సాగు పనులు ప్రారంభించారు. ఎకరాకు 15 నుంచి 20 వేలు ఖర్చు చేసి వరి నాట్లు వేశారు. జిల్లాలోని కోవూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, అల్లూరు, విడవలూరు, కొడవలూరు ప్రాంతాల్లో వరి పంట వేయగా....తుపాను దెబ్బకు పొలాలు నీట మునిగాయి. కాలువల్లో పూడిక తీయకపోవడంతో వరద నీరు బయటకు పోయే మార్గం లేక పంట పొలాలు చెరువులా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

కష్టమంతా నీటిపాలు: జిల్లాలో వరి పంటతో పాటు ఉద్యానవన పంటలకు నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 16మండలాల్లోని 118గ్రామాల్లో 517 హెక్టార్లలో నర్సరీ దశలో, 7501హెక్టార్లలో సాగు దశలో పంట నీట మునిగినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. వేరుశనగ, పత్తి సహా ఇతర పంటలు తుపానుదెబ్బకు దెబ్బతిన్నాయి. నంద్యాల జిల్లాలో ఆరబోసిన ధాన్యం తడవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

వర్షానికి దెబ్బతిన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. ప్రకాశం జిల్లా మార్కాపురం, కొనకనమిట్ల మండలాల్లో మిరప పంట నీట మునిగింది. తిప్పాయిపాలెం, బిరుదులనరవ, నికరంపల్లి, వేములకోట రైతులు అకాల వర్షంతో నష్టపోయామని వాపోతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో కోతకు వచ్చిన వరి, మినుము నీట మునిగాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details