ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద తెదేపా నేతలపై జరిగిన దాడి ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఆయన శనివారం లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు, దౌర్జన్యాలతో వైకాపా నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, మాఫియా శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. పోలీసుల్లో ఒక వర్గం అధికార వైకాపా నాయకులతో కుమ్మక్కై వారి చెప్పుచేతల్లో పని చేయడం దురదృష్టకరమని చంద్రబాబు దుయ్యబట్టారు.
'తంబళ్లపల్లెలో వైకాపా మాఫియా ఈసారి పడగ విప్పింది. కురబలకోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీకి చెందిన తెదేపా నాయకుల వాహనాలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా వారి వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసకర దాడి అంతటితో ఆగకుండా ఒక విలేకరిపై కూడా దాడి చేసి అతని కెమెరాను లాక్కున్నారు. వైకాపా దౌర్జన్యానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అంగళ్లుకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయల్పాడు పోలీసు స్టేషన్కు తరలించారు' అని చంద్రబాబు లేఖలో వివరించారు.