Nirmala Sitharaman Comments on CM KCR: తెలంగాణలో ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలియదా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. అమృతకాల బడ్జెట్ అంశంపై దూరదర్శన్ న్యూస్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అప్పుడు ఎంత.. ఇప్పుడు ఎంత..?: చేతులు జోడించి చెబుతున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరాలన్న లక్ష్యంపై విమర్శలు చేయొద్దని నిర్మలా సీతారామన్ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనకు ముందు తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎంత? ఇప్పుడు ఎంత ? అని ఆమె ప్రశ్నించారు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి 60వేల కోట్ల రూపాయలే ఉండగా, ఇప్పుడు 3లక్షల కోట్ల రూపాయలకు చేరాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాల అప్పులను కంట్రోల్ చేసే బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.