తెలంగాణ

telangana

BRS Leaders Joining in Congress : 'కారు' దిగి.. 'చేయి' అందుకునేందుకు రెడీగా ఉన్న నేతలు వీళ్లే

By

Published : Jun 15, 2023, 9:04 AM IST

Congress Joinings : మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ... రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల ఎత్తులకు పైఎత్తులు, నేతల చేరికలతో ఆర్నెళ్ల ముందుగానే ఎన్నికల వేడి మొదలవుతోంది. పొంగులేటి, జూపల్లితో పాటు మరికొందరు నేతలు కారు దిగి.... హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైన తరుణంలో.... తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి సైతం కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Congress joining
Congress joining

కాంగ్రస్​లో చేరనున్న అధికార పార్టీ నాయకులు

Ponguleti To Join Congress : రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అంశంగా మారిన మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం వేళ... వారి బాటలోనే పయనించేందుకు మరికొందరు నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా పొంగులేటి, జూపల్లి అడుగులపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనగా.... ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు వారి అనుచరవర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు దిల్లీలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

BRS Leaders Joining in Congress :కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో పాటు మరికొందరు నాయకులు కూడా వీరితో చర్చలు జరపగా.. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ ఠాక్రే తదితరులు వారిని కలిసి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ దిల్లీకి తిరిగి రాగానే ఆయణ్ను కలిసేందుకు సమయం కోరినట్లు తెలిసింది.ఈ నెల 17న రాహుల్‌ తిరిగివచ్చే అవకాశం ఉందని, 18 లేదా 19న అగ్రనేతతో చర్చించిన తర్వాత దిల్లీలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చేరికపై అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Congress Public Meeting In Khammam :అనంతరం ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగసభ ద్వారా పార్టీలో అనుచరులతో కలిసి చేరుతారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. దాంతో సంబంధం లేకుండా పొంగులేటి ఖమ్మంలో ప్రత్యేకంగా బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

BRS Leaders To Join Congress : పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు బీఆర్ఎస్​తో ఉన్న మరికొందరు హస్తం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కారు దిగేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. కొల్లాపూర్‌ లేదా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల, ఆయన కుమారుడు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం సాగుతోంది..

ఇదిలా ఉండగా.... తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కాంగ్రెస్‌లో చేరతారనిప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం సునీల్‌ కనుగోలును వేరే రాష్ట్రంలో ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం. ఆ సమావేశం తర్వాత చేరికకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానం అందుకు సానుకూలంగా లేదనే ప్రచారం ఉంది. ఇతరత్రా ప్రాధాన్యం ఇచ్చినా.. సిట్టింగ్‌లను కాదని టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details