Smita Sabharwal Tweet Today: అర్ధరాత్రి తన ఇంట్లోకి ఓ చొరబాటు దారుడు రావటం.. అత్యంత బాధాకరమని ఐఏఎస్ అధికారిణి , ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి అతని నుంచి తనను తాను కాపాడుకున్నానని తెలిపారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నామని భావించిన తలుపు, తాళాలు సరిగా వేసి ఉన్నాయో లేదో అన్న విషయాన్ని స్వయంగా తనిఖీ చేయాలన్న గుణపాఠం నేర్చుకున్నట్టు వివరించారు.
అత్యవసరమైతే డయల్ 100కి కాల్ చేయాలని స్మితా సబర్వాల్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆనంద్ రెడ్డి అనే డిప్యూటీ తహసీల్దార్ అర్థరాత్రి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడగా.. తక్షణం పరిస్థితిని గమనించిన ఆమె సెక్యూరిటీ గార్డులను పిలవటంతో వారు అతనని పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే.. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే:విశ్వసనీయ సమాచారం మేరకు.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే స్మితా సబర్వాల్ ట్వీట్లకు సదరు డిప్యూటీ తహసీల్దార్(48) ఒకట్రెండుసార్లు రీట్వీట్లు చేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో.. అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.
స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు తట్టాడు. డోర్ తెరిచిన మహిళా ఐఏఎస్కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో నివ్వెరపోయారు. తేరుకున్న ఆమె.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో మీకు ట్వీట్ చేశానంటూ చెప్పిన డిప్యూటీ తహసీల్దార్.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని సమాధానమిచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బయటికి వెళ్లాలని గట్టిగా చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపు భద్రతాసిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మహిళలకు రక్షణ లేకపోవటమే తెలంగాణ మోడలా?: ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్.. శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శికే భద్రత లేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా క్షీణించాయని వివరించారు. మహిళలకు రక్షణ లేకపోవటమే తెలంగాణ మోడలా అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:ఫలించిన కేసీఆర్ కృషి.. ప్రాంతీయ భాషల్లోనూ ఎస్ఎస్సీ పరీక్షలు
ఇంటర్బోర్డు నిర్వాకం.. ఇష్టారాజ్యంగా జూనియర్ కళాశాలల తరలింపు!
ఇంటి వద్దే దహన సంస్కారాలు.. విద్యుత్, గ్యాస్తో నడిచేలా సంచార శ్మశానం ఏర్పాటు