ఇంటర్‌బోర్డు నిర్వాకం.. ఇష్టారాజ్యంగా జూనియర్‌ కళాశాలల తరలింపు!

author img

By

Published : Jan 22, 2023, 9:25 AM IST

Private Junior Colleges

Telangana Inter Board: రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులు చెప్పిందే వేదంగా సాగుతోంది. రాజకీయ నాయకుల ఆశీస్సులంటే చాలు.. ఏ పనైనా జరిగిపోతుంది. ప్రైవేట్​ కళాశాలల తరలింపు వారి లేఖలతోనే ఇష్టారాజ్యంగా వేగంగా ముందుకు కదులుతున్నాయి. ఇంటర్​ బోర్డు ఈ విషయంలో చూసిచూడనట్లు ఉన్నది.

Private Junior Colleges In Telangana: రాష్ట్రంలో ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల తరలింపు ప్రహసనంగా మారింది. రాజకీయ నేతల ఆశీస్సులుంటే చాలు..మండలం నుంచి మరో మండలానికే కాదు...ఒక జిల్లా నుంచి మరో జిల్లాకూ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. ఈ కారణంగా నిజమైన అవసరం ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని కళాశాలల యాజమాన్యాలు ఆక్షేపిస్తున్నాయి.

అపరిష్కృతంగా ఉన్నా.. పక్కనబెట్టి.. జూనియర్‌ కళాశాలలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు వీలు కల్పిస్తూ ఇంటర్‌ బోర్డు యేటా దరఖాస్తులు స్వీకరిస్తుంది. సాధారణంగా ఒకే మండల పరిధిలో ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చుకునేందుకు(లోకల్‌ షిఫ్టింగ్‌) బోర్డే అనుమతి ఇస్తుంది. ఒక మండలం నుంచి మరో మండలానికి, లేదా మరో జిల్లాకు తరలించాలంటే(నాన్‌ లోకల్‌ షిఫ్టింగ్‌) ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్‌బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా 320కిపైగా కళాశాలల తరలింపునకు యజమానులు ముందుకొచ్చారు. వాటిల్లో ఇంకా 56 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఆ తర్వాత నాన్‌ లోకల్‌ తరలింపును ప్రోత్సహించవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి(2022-23) ఇంటర్‌బోర్డు దరఖాస్తులు ఆహ్వానించలేదు. దరఖాస్తులూ స్వీకరించడం లేదు.

ఇదిగో లేఖ.. అదిగో అనుమతి: ప్రజాప్రతినిధుల సిఫార్సు ఉన్న, పలుకుబడి ఉన్న వారి కళాశాలల తరలింపునకు మాత్రం సర్కార్‌ పచ్చజెండా ఊపుతోందనే ఆరోపణలున్నాయి. సిఫార్సు లేఖలు ఉన్న పక్షంలో ఫలానా కళాశాల నాన్‌ లోకల్‌ షిఫ్టింగ్‌కు అనుమతిచ్చే అంశాన్ని పరిశీలించాలని, ముగ్గురు సభ్యుల కమిటీ(టీఎంసీ)తో పరిశీలించి వెంటనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంటర్‌బోర్డు కార్యదర్శికి లేఖ రాస్తున్నారు. ఆ వెనువెంటనే కార్యదర్శి సర్కారుకు నివేదిక పంపడం, అనుమతులు వచ్చేయడం జరిగిపోతోంది. ఉదాహరణకు కొన్ని రోజుల క్రితం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ లేఖను ప్రస్తావిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌లోని బండ్లగూడకు కళాశాల తరలింపునకు వీలుగా విద్యాశాఖ అదనపు కార్యదర్శి ఇంటర్‌బోర్డుకు లేఖ రాశారు.

Inter College Transfer Will Of Public Representatives: ఓ కార్పొరేట్‌ విద్యా సంస్థ ఇటీవల ఆరు జూనియర్‌ కళాశాలలను కొనుగోలు చేసింది. వాటిని నకిరేకల్‌ నుంచి నల్గొండకు, మహబూబాబాద్‌ నుంచి ఖమ్మం, బాల్కొండ నుంచి నిజామాబాద్‌, హయత్‌నగర్‌ నుంచి ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్‌ నుంచి గండిమైసమ్మ, హయత్‌నగర్‌ నుంచి సంతోష్‌నగర్‌కు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశిస్తూ నవంబరులో సీఎం కార్యాలయం అధికారి ఒకరు ఇంటర్‌బోర్డుకు లేఖ రాశారు.

ఇలా నిత్యం సిఫార్సు లేఖలు వస్తూనే ఉన్నాయని బోర్డులో ఒక అధికారి అన్నారు. గత ఏడెనిమిది నెలల్లోనే పదుల సంఖ్యలోనే బోర్డుకు అందాయని తెలిపారు. ఇలాంటి లేఖలు ఎంఐఎం ఎమ్మెల్యేల నుంచి ఎక్కువగా వస్తున్నాయని వాపోయారు. వాస్తవంగా కళాశాలలను తరలించాలంటే ఇంటర్‌బోర్డు లాగిన్‌లో నమోదుచేసి, సంబంధిత రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలించి నివేదిక అందిస్తుందని వివరించారు. దాన్ని ఇంటర్‌బోర్డు అధికారులు ప్రభుత్వానికి పంపిస్తారు.. ఆ తర్వాతే తరలింపునకు అనుమతి వస్తుందన్నారు. పలుకుబడి ఉన్న వారి విషయంలో ఈ వ్యవహారం అంతా అత్యంత వేగంగా జరిగిపోతోందని బోర్డు సభ్యుడు తెలిపారు.

గురుకులాలతోపాటు కేజీబీవీలు పెరగడం, కొన్నిచోట్ల అవసరానికి మించి కళాశాలలు ఉండటంతో ప్రవేశాలు లేక పలు కళాశాలలు మూతపడే స్థితిలో ఉన్నాయని ఇంటర్​ విద్య జేఏసీ ఛైర్మన్​ మధుసూదన్​రెడ్డి తెలిపారు. వాటిని మరో ప్రాంతానికి తరలిద్దామంటే ఇంటర్‌బోర్డు దరఖాస్తులు తీసుకోవడం లేదని వాపోయారు. దీంతో కొన్ని కళాశాలల యజమానులు నష్టాల్లో కూరుకుపోతున్నారని.. అదే సమయంలో పలుకుబడి ఉన్న వారికి ఆగమేఘాలపై అనుమతులు వస్తున్నాయని.. ఇది మంచి వైఖరి కాదని స్పష్ట్ం చేశారు. ఈ విషయంలో పారదర్శకత ఉండేలా బోర్డు స్పష్టమైన విధానాన్ని పాటించాలని ఇంటర్‌ విద్య జేఏసీ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.