భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 53 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఫలితంగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం గోదావరికి 14 లక్షల 26 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గోదావరి ఉద్ధృతితో వారం రోజులుగా ముంపు మండలాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లే రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలోనే రాత్రికి గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. ముంపు వాసులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై వరద చేరిన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ హెచ్చరించారు.
నెల కూడా కాలేదు: నెల రోజులు కూడా కాకముందే గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాద్రివాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి మూడు రాష్ట్రాలకు భారీ వాహనాలను వెళ్లనీయడం లేదు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నారు.